రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మాకు ఓట్లేసి గెలిపించండి.. అంటూ స్టార్ క్యాంపెయినర్ల ద్వారా, ఇంటింటికి లేదా మైకులు.. పోస్టర్ల ద్వారా ప్రచారం చేసే నేతలు నయా రాజకీయాలకు తెర తీస్తున్నారు. మాకు ఓట్లు వేయండి అని ఆయా పార్టీల నేతలు కోరడం మాని.. వాళ్లకు వేయకండి అంటూ బాధితులతోనే ప్రచారం చేయిస్తున్నారు. ఇటువంటి వింతైన ప్రచారానికి తెలంగాణ వేదికగా మారింది. హ్యాట్రిక్ విజయం కోసం బీఆర్ఎస్, ఈసారి అధికారం హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడడం పక్కా అంటూ బీజేపీ ప్రచారం చేస్తోంది. ఇలా తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది.
ఎన్నికల నోటిఫికేషన్ ముందు నుంచే.. పొలిటికల్ హీట్ పెరిగింది. పార్టీలన్నీ అస్త్రశస్త్రాలకు పదునుపెడుతున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోరు ఖాయమనే విశ్లేషణల నేపథ్యంలో ఆ మూడు పార్టీలు సంసిద్ధమయ్యాయి. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్యే పోరు అన్నట్లుగా మారింది. దీంతో ఇరు పార్టీలు ఒక దానిపై మరొకటి పోటీగా ప్రచారం సాగిస్తున్నాయి. తాజాగా ఓ ప్రచారం ఆసక్తి రేకెత్తిస్తోంది. తొలుత కాంగ్రెస్ తమకు పోటీనే కాదంటూ బీఆర్ ఎస్ బీరాలు పలికేది. ప్రస్తుతం పరిస్తితులు మారడంతో వింత ప్రచారానికి తెర లేపింది.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలోని సమస్యలను బీఆర్ ఎస్ తెలంగాణ ప్రచార అస్త్రాలుగా ఉపయోగించుకుంటోంది. ఎడాపెడా విధిస్తున్న విద్యుత్తు కోతలతో సామాన్యులు, రైతులు అల్లాడిపోతున్నారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడువకముందే కన్నడ నేలను అంధకారంలోకి నెట్టేసిన కాంగ్రెస్పై నిప్పులు చెరుగుతున్నారు. కోతలు లేకుండా కరెంటు సప్లై చేయాలని డిమాండ్ చేసి రోడ్లెక్కుతున్నారు. రైతన్నల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో.. మాకు కరెంటు ఇస్తారా? లేదా? అంటూ ఓ సబ్స్టేషన్లో ఇటీవలి మొసలిని వదిలేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఇలా కాంగ్రెస్ను నమ్మి అధికారం అప్పగించి నట్టేట మునిగామని గ్రహించిన కర్ణాటక రైతన్నలు.. హస్తం పార్టీని నమ్మి మరెవరూ మోసపోవద్దని ప్రచారం మొదలుపెట్టారు.
కాంగ్రెస్ను నమ్మి తమలా మరెవరూ మోసపోవద్దని త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండటంతో గద్వాలకు వచ్చి ప్రచారం నిర్వహించారు. కరెంటు లేక మా పంటలు ఎండిపోతున్నాయి. కాంగ్రెస్ చేతిలో మేం మోసపోయాం.. మీరు మోసపోకండి అని తెలంగాణ రైతన్నలు విజ్ఞప్తి చేశారు. ఈ రైతుల ఆందోళనలను బీఆర్ ఎస్ సోషల్ మీడియా వింగ్ విపరీతంగా వైరల్ చేస్తోంది. తమకు ప్రచార అస్త్రంగా మార్చుకుని ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ