ఎన్నికలు వస్తున్నాయంటే.. సవాళ్లు, ప్రతిసవాళ్లు సాధారణమే. అయితే.. కొన్ని మాత్రం చాలా హాట్ టాపిక్ గా మారతాయి. ప్రముఖుల కంచుకోటలను సైతం బద్దలుగొడతామని.. ఏకంగా ముఖ్యమంత్రినే ఎమ్మెల్యేగా ఓడిస్తామని విపక్ష నేతలు చాలెంట్ విసురుతారు. లేదా.. దమ్ముంటే నాతో.. నా నియోజకవర్గంలో పోటీ చేయాలని ప్రకటిస్తారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి పోటీ చేయనున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఆయనను ఓడిస్తామని బీజేపీ చెబుతుంటే.. దమ్ముంటే కేసీఆర్ కొడంగల్ లో పోటీ చేయాలని రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు.
కేసీఆర్ ఓడిపోతారా..? ఓడించగలరా..?
తెలంగాణ రాష్ట్ర అనంతరం జరిగిన గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి జరగబోయే ఎన్నికల్లో భిన్న వాతావరణం కనిపిస్తోంది. తిరుగులేని పార్టీగా సత్తా చాటిన టీఆర్ ఎస్.. బీఆర్ ఎస్ గా మారిన తర్వాత జరగబోయే ఎన్నికల్లో గెలుపు కోసం పోరాడాల్సి వస్తోంది. ఏకంగా ఎమ్మెల్యేగా కేసీఆరే ఓడితారని, ఓడిస్తామని రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎన్నడూలేని విధంగా ఆయన ఈసారి రెండు చోట్ల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం కూడా ఆసక్తిగా మారింది. ఓటమి భయంతోనే కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇక మొదటి నుంచీ కేసీఆర్ పై నిప్పులు గక్కుతున్న బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కేసీఆర్ ను ఓడిస్తానని మొదటి నుంచీ చెబుతున్నారు. అన్నట్లుగా హుజూరాబాద్ తో పాటు, గజ్వేల్ నుంచి కూడా ఆయన బీజేపీ అభ్యర్థిగా నిలిచారు. మరోవైపు టీ.కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ కు సవాల్ విసురుతున్నారు. దమ్ముంటే కేసీఆర్ కొడంగల్ నుంచి పోటీ చేసి గెలవాలని చాలెంజ్ చేశారు.
అంత ఈజీనా..
తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా పేరొందిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అలియాస్ కేసీఆర్ ను ఓడించడం ఆషామాజీ కాదు. 1983లో తెలుగుదేశం నుంచి పోటీ చేసిన కేసీఆర్ ఓడిపోయారు. ఆ తర్వాత 1985, 1999లో సిద్దిపేట నుంచి వరుసగా నాలుగు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించారు. ఎన్నో మంత్రి పదవులను అనుభవించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేశారు. తెలంగాణ అనంతరం 2014లో 19,218 మెజారిటీతో తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలోని గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, మెదక్ నుండి 397,029 మెజారిటీతో ఎంపీగా ఎన్నికయ్యారు ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేసి బంపర్ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీని బలోపేతం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా ప్రజల్లో గుర్తింపు పొందిన కేసీఆర్ ను ఎలాగైనా గజ్వేల్ నుంచి ఓడించాలని రాజేందర్ కంకణం కట్టుకున్నారు. అయితే.. అది అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. ఇటీవల కేసీఆర్ ఇలాకాలోని కొందరు నాయకులు సైతం ఆయన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో గజ్వేల్ లో కేసీఆర్ పోటీ ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ