తెలంగాణ అసెంబ్లీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ జరుగుతుండగా తెలంగాణలో కూడా సోమవారం ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఓటింగ్లో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ఆమె అనుకోని తప్పిదం చేశారు. అధికారులు ఇచ్చిన బ్యాలెట్ పేపర్పై విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఓటు వేయబోయి, పొరపాటున మొదటి ప్రాధాన్యతా ఓటును బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్మూకు వేశారు. అయితే చేసిన పొరబాటుని గుర్తించిన సీతక్క విషయాన్ని వెంటనే ప్రిసైడింగ్ అధికారి దృష్టికి తెచ్చారు. కన్ఫ్యూజన్లో తాను ఒకరికి ఓటు వేయబోయి మరొకరికి వేశానని, మరో బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని అధికారులను కోరారు.
అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం మరో బ్యాలెట్ పేపర్ ఇవ్వటం కుదరదని అధికారులు సీతక్కకు తేల్చి చెప్పారు. కానీ ఆమె జరిగిన విషయాన్ని అధికారులకి వివరిస్తూ.. మొదటి ప్రాధాన్యతా ఓటును వేసే క్రమంలో పొరపాటున ఇది జరిగిందని, ఇంకో బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని అధికారులను అభ్యర్ధించారు. కాగా దీనిపై స్పందించిన అధికారులు ఇది తమ పరిధిలో లేదని, కొంచెం సమయమిస్తే పై అధికారులతో చర్చించి వారు సూచించిన మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యేకు తెలిపారు. దీంతో బ్యాలెట్ పేపర్ను డ్రాప్ బాక్స్లో వేయకుండా సీతక్క బయటకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో అసెంబ్లీ ప్రాంగణంలోనే వేచి ఉన్న ఆమె అధికారుల తుది నిర్ణయం కోసం వేచిచూస్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత సీతక్క స్వయంగా ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. కాగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తున్న విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ