కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో యాత్ర’ రేపు (అక్టోబర్ 23, ఆదివారం) తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. తెలంగాణలో మొత్తం 375 కిమీ మేర రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనుండగా, ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఖరారైంది. ఆదివారం ఉదయం 6.30 గంటలకు కర్ణాటక నుంచి కృష్ణ రివర్ బ్రిడ్జి మీదుగా మక్తల్ నియోజకవర్గంలోకి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రవేశిస్తుంది. రేపు తెలంగాణలోకి రాహుల్ గాంధీకి ఘన స్వాగతం చెప్పడానికి, భారత్ జోడోయాత్రను విజయవంతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. అలాగే కీలక కాంగ్రెస్ నేతలంతా భారత్ జోడోయాత్ర సన్నాహాల్లో మునిగిపోయారు.
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్, ఇతర రాష్ట్రస్థాయి నేతలంతా పలు సమావేశాలు నిర్వహించి, ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర విజయవంతం చేసేందుకు రిసెప్షన్ కమిటీ సహా మరో 13 రకాల పర్యవేక్షణ కమిటీలను తెలంగాణ పీసీసీ ఇప్పటికే ఏర్పాటు చేసి, బాధ్యతలను అప్పగించింది. ఆయా కమిటీలు వెంటనే సమావేశాలు నిర్వహించి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని సూచించారు.
తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర కృష్ణ రివర్ బ్రిడ్జి మీదుగా మక్తల్, దేవరకద్ర, మహబూబ్నగర్ టౌన్, జడ్చర్ల, షాద్నగర్, శంషాబాద్, ఆరాంఘర్, బహదూర్ పురా, చార్మినార్, ఆఫ్జల్ గంజ్, మోజంజహి మార్కెట్, గాంధీభవన్, నెక్లెక్రోడ్, బోయిన్పల్లి, బాలానగర్, మూసాపేట వై జంక్షన్, కూకట్పల్లి, మియాపూర్, బీహెఛ్ఈఎల్, పటాన్చెరు, ముత్తంగి, సంగారెడ్డి క్రాస్ రోడ్, జోగీపేట్, శంకరంపేట్, మద్నూర్ వరకు సాగనుంది. కాగా దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 24, 25, 26న మూడు రోజుల పాటు పాదయాత్రకు విరామం ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. అయితే రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో పార్టీకి ఊహించని ఊపు ఇస్తుందని నాయకులు భావిస్తున్నారు. తెలంగాణలో రాహుల్ యాత్ర ఎలాంటి మార్పులు తేబోతుంది?, ఏఏ అంశాలపై రాహుల్ గాంధీ స్పందించనున్నారు? అనే దానిపై వేచి చూడాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY