నవంబర్ 9న ట్యాంక్ బండ్ పై నిర్వహించిన సకలజనుల సామూహిక దీక్ష సందర్భంగా జరిగిన లాఠీచార్జ్ కు నిరసనగా తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపుతో కార్మికులు ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ప్రతినిధుల ఇళ్లను ముట్టడించే ప్రయత్నం చేసారు. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాల వద్ద ఆందోళన చేపట్టి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరుతూ, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పలు చోట్ల పోలీసులకు, ఆర్టీసీ కార్మికులకు మధ్య తోపులాట జరగగా పలువురు కార్మికులు గాయపడ్డారు. కొంత మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జేఏసీ నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మంత్రుల నివాసం వద్ద భారీ భద్రతతో పాటు ముందుగానే బారికేడ్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఈ ముట్టడిపై స్పందిస్తూ హైదరాబాద్ సిటీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా ముట్టడిలకు పిలుపునిచ్చి, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సిద్దిపేటలోని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్రావు నివాసాన్ని ముట్టడించేందుకు కార్మికులు యత్నించిన సమయంలో పోలీసులతో జరిగిన తోపులాటలో ఓ మహిళా కండక్టర్ గాయపడ్డారు. హన్మకొండ రామ్నగర్లోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇంటి ఎదుట కూడ కార్మికులు నిరసనతో కొద్దీసేపు ఉద్రిక్త వాతావరణ చోటు చేసుకుంది. సూర్యాపేటలో మంత్రి జగదీశ్రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు అఖిలపక్ష నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వ చీఫ్ విప్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తో పాటు పలువురి నాయకుల ఇళ్లను ముట్టడించేందుకు ఆర్టీసీ కార్మికులు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకుని ఎక్కడిక్కడే వారిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.
[subscribe]