సౌదీ అరేబియా రాయబారి డాక్టర్ సౌద్ బిన్ మహ్మద్ అస్సతి డిసెంబర్ 9, సోమవారం నాడు హైదరాబాద్లోని ప్రగతి భవన్ లో రాష్ట్ర ఐటి, పరిశ్రమల, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను కలిశారు. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ సలహాదారు (మైనారిటీ వ్యవహారాలు) ఎ కె ఖాన్, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు. తెలంగాణలో ఐటి రంగానికి పెట్టుబడులు పెట్టడం, సౌదీ అరేబియా మరియు తెలంగాణ మధ్య సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు వివిధ అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణ గడిచిన ఐదేళ్లలో గొప్ప ప్రగతిని సాధించిందని, రాష్ట్రంలో అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ వివరించారు. అలాగే టీఎస్ఐపాస్ ద్వారా ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడంలో తెలంగాణ ప్రభుత్వం మంచి విజయం సాధించిందని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతుందని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం పెద్ద ఎత్తున ప్రజలు సౌదీకి వెళ్తుంటారని, వారికీ అనువుగా హైదరాబాద్లో సౌదీ కాన్సులేట్ ఏర్పాటు చేయాలని సౌదీ రాయబారిని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కోరారు.
[subscribe]