ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల కన్నుమూసారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు, కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1945 జూలై 30న యానాంలో దేవదాస్ కనకాల జన్మించారు. ఇటీవలే దేవదాస్ కనకాల భార్య లక్ష్మీదేవి కూడ మృతి చెందారు, ఆయనకు ఇద్దరు సంతానం కుమారుడు రాజీవ్ కనకాల, కుమార్తె శ్రీలక్ష్మీ. నటనా శిక్షకుడుగా దేవదాస్ కనకాలకు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన మొదట్లో పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్నారు. నటుడిగా పేరు సంపాదించిన తరువాత చెన్నై, మరియు హైదరాబాద్ లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నడిపి అనేక మంది నటులకు శిక్షణ ఇచ్చారు.
ఓ సీత కథ, సిరి సిరి మువ్వ, గ్యాంగ్ లీడర్, మంచుపల్లకి, గోరింటాకు, చెట్టుకింద ప్లీడర్, అమ్మో ఒకటో తారీఖు, మనసంతా నువ్వే, శ్రీరామ్, పెదబాబు, మల్లీశ్వరి వంటి అనేక చిత్రాల్లో నటించారు. ప్రముఖ నటులుగా పేరుగాంచిన చిరంజీవి, రాజేంద్రప్రసాద్, రజనీకాంత్, నాజర్, రఘువరన్ ఇలా ఎంతోమంది దేవదాస్ కనకాల దగ్గర నటనలో ఓనమాలు నేర్చుకున్నారు. సినిమాపై ఆశలతో ఇండస్ట్రీకి వచ్చిన అనేకమందికి శిక్షణ ఇచ్చి, తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన ఘనత దేవదాస్ కనకాలకు దక్కుతుంది. ఇటీవలే ఆయన సతీమణి చనిపోవడంతో తీవ్ర వేదనకు గురయ్యారు, తరువాత ఆ క్రమంలోనే అనారోగ్యం పాలవడంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మృతి చెందినట్టు ఆయన కుమారుడు రాజీవ్ కనకాల తెలియజేసారు. దేవదాస్ కనకాల మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.