ప్రస్తుతం భారతజట్టుకు కోచ్ ఎంపిక ఆసక్తికరంగా మారింది. కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామితో కూడిన క్రికెట్ సలహా కమిటీ కి కోచ్ ఎంపిక బాధ్యతలును బీసీసీఐ అప్పగించింది. జూలై 30తో దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి గడువు కూడ ముగిసింది. అయితే ఇలాంటి సమయంలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోచ్ పదవిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. భారతజట్టుకు కోచ్ గా సేవలందించడంపై తన మనసులోని మాటలను బయట పెట్టాడు. భవిష్యత్ లో ఏదో ఒక రోజు భారతజట్టుకు కోచ్ గా బాధ్యతలు చేపడతానని గంగూలీ పేర్కొన్నాడు.
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ, భారత జట్టు కోచ్ గా బాధ్యతలు స్వీకరించాలని ఉందని, అయితే ఇప్పుడు కుదరడం లేదని దానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. ప్రస్తుతం ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సలహాదారుగా, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్ గా, టీవీ కామెంటేటర్ గా వివిధ బాధ్యతలతో బిజీగా ఉన్నానని, వాటిని సమర్థవంతంగా పూర్తీ చేసి కోచ్ పదవి గురించి ఆలోచిస్తానని చెప్పారు. తాజాగా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న వారి గురించి స్పందిస్తూ, కోచ్ పదవికి ఆసక్తి చూపిన వారిలో ఎక్కువగా పెద్ద పేర్లు ఏమి వినిపించలేదు, జయవర్దనే ఎందుకు ఎనక్కు తగ్గాడో తెలియదన్నారు. మళ్ళీ కోచ్ గా రవిశాస్త్రి ఎంపిక అవుతాడా అనే విషయంపై అభిప్రాయం చెప్పడానికి ఇది సరైన సమయం కాదన్నారు. వెస్టిండీస్ సిరీస్ యువ ఆటగాళ్లకు మంచి అవకాశం అని, ఎక్కువ అవకాశాలు ఇచ్చి వారిని ప్రోత్సహించాల్సిన అవసరముందని గంగూలీ తెలిపారు.