ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రజలకు దరఖాస్తుల స్వీకరణ తేదీ ప్రకటించినప్పటికీ.. షరతులు విధించడం సమస్యగా మారింది. ఎన్నికల ప్రచార సమయంలో ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ విపరీతంగా ప్రచారం చేసింది. వాటితో ప్రజలను ఆకట్టుకుని ఓట్లను రాబట్టుకుంది. చివరకు విజయం సాధించింది.
గెలిచిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్య పథకాలను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు సంతోషంగా ఉన్నారు. మిగతావి ఎప్పుడు అమలు చేస్తారని ఎదురుచూస్తుండగా.. ఈ నెల 28వ తేదీ నుంచి ఐదు పథకాలకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రకటించింది. మహాలక్ష్మిలో భాగంగా మహిళలకు నెలకు రూ.2,500 నగదు బదిలీ, గృహజ్యోతి పేరుతో రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇల్లు పేరుతో ప్రతి లబ్ధిదారునికీ రూ.5 లక్షలు, నెలకు రూ.4 వేల పింఛను, రైతు భరోసా ఐదింటినీ తొలివిడత ప్రజాపాలనలో అమలుచేయాలని నిర్ణయించారు.
వచ్చే నెల ఆరో తేదీ వరకూ మొత్తం ఎనిమిది పని దినాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామ పంచాయతీలో, పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపల్ వార్డులో.. ఐదు పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ప్రజలు ఒక్కో పథకానికీ ఒక్కొక్కటి చొప్పున వేర్వేరుగా దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్నింటికీ కలిపి ఒకే దరఖాస్తు ఇస్తే సరిపోతుంది. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ.. ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాలు అన్నింటికీ రేషన్కార్డును ప్రాతిపదికగా పెట్టడం చాలా మందికి షాక్నిచ్చింది.
ఆరోగ్య శ్రీ వంటి పథకాలకు రేషన్కార్డు ఓకే కానీ.. 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్, రూ.500కే గ్యాస్ వంటి పథకాలు అందరికీ వరిస్తాయని భావించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 20 వేల లీటర్ల ఉచిత నీటి సరఫరాకు ఎటువంటి ఆంక్షలూ విధించలేదు. గ్రేటర్ పరిధిలో అందరికీ వర్తింపచేసింది. రేషన్కార్డు లేని వారిలో చాలా మంది పేదలు, మధ్య తరగతి ప్రజలూ ఉన్నారు. సరైన ఆధారాలు, లేదా అవసరం లేకపోయినా బ్యాంకు లోన్ల కోసం ఐటీ తీసుకోవడం వంటి కారణాలతో రేషన్కార్డు పొందలేకపోతున్నారు. ఐటీ ఉన్న వారందరూ ధనికులనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే.. రుణాల కోసం తప్పక కొందరు ఐటీ తీసుకుంటున్నారు.
ఇప్పుడు రేషన్కార్డు ప్రామాణికంగా ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ సర్కారు సన్నద్ధం కావడంతో దిగువ మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తులో రేషన్కార్డు వివరాలు పొందుపరచాలని పేర్కొన్న సర్కారు లేనివారు ఆ విషయాన్నే దరఖాస్తులో రాస్తే.. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని రేషన్ కార్డు కూడా జారీ చేస్తారని చెప్పారు. అలాకాకుండా అర్హులకు కొత్త రేషన్కార్డులు త్వరితగతిన మంజూరు చేసిన తర్వాత ఇతర పథకాలను పరిగణనలోకి తీసుకుంటే గందరగోళం ఉండేది కాదు. లేదా ఏసీలు వినియోగించలేని దిగువ మధ్యతరగతి, పేదలే 200 యూనిట్ల లోపు కరెంట్ వాడే వారిలో ఉంటారు కాబట్టి ఆ పథకం, రూ. 500కే గ్యాస్ పథకానికి అయినా రేషన్కార్డు ప్రామాణికం లేకుంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE