పాలకుడిని కాదు.. సేవకుడిని. తెలంగాణలో బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి. ప్రజాప్రభుత్వం కొలువుదీరింది.’.. ఇదీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం రేవంత్ తొలి ప్రసంగం, తొలి ట్వీట్లోని సారాంశం. చెప్పినట్లుగానే ప్రజలచేత కీర్తించబడేలా రేవంత్ పాలన సాగిస్తున్నారు. రెండు రోజులకే రెండు గ్యారెంటీలు అమలు చేసి భళా అనిపించుకున్నారు. అదే పరంపర కొనసాగిస్తూ త్వరలోనే మిగతావి గ్యారెంటీగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆ దిశగా ముందుకు సాగాలని కృత నిశ్చయంతో ఉన్న రేవంత్ రెడ్డి ఎంత వరకూ పాలనపై పట్టుబిగిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల జరిగిన తొలి శాసనసభ సమావేశాల్లో విపక్షాలకు చుక్కలు చూపుతూ.. గతం, ప్రస్తుతం పరిస్థితులను వివరిస్తూ తన వాగ్దాటితో ఆకట్టుకున్న రేవంత్.. ఎన్నికల ప్రచారంలో అంతకంటే తీవ్రమైన స్వరంతోనే ప్రజలకు ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో వాటి అమలుకు కృత నిశ్చయంతో ఉన్నారు. అయితే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, అప్పుల కుప్ప అని ఆయనే ప్రకటించారు. అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వెనక్కి తగ్గేది లేదని చెబుతూ.. ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు 28 నుంచి ప్రజాపాలన పేరుతో ప్రజలకే వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ప్రజా పాలనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని చేయడానికి తీవ్రమైన కసరత్తే చేస్తోంది. ఇప్పటికే జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమించింది. ఉమ్మడి పది జిల్లాలకు పది మంది మంత్రులను ఇన్చార్జిలుగా నియమించింది. ప్రజల సమస్యల్ని తెలుసుకుని, వాటిని పరిష్కరించడం కోసం ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపడుతోందన్న సారాంశాన్ని ప్రజలకు చేరవేసేందుకు ప్రచారం చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు ప్రజలకు న్యాయం జరిగేలా ఇన్చార్జి మంత్రులు కృషి చేసేలా రేవంత్ చర్యలు తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మినహా మిగిలిన 10 మంది మంత్రులనూ ఒక్కో జిల్లాకు ఇన్చార్జిగా నియమించారు.
ఉమ్మడి జిల్లాల వారీగా కరీంనగర్కు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డిని, దామోదర రాజనర్సింహను మహబూబ్నగర్కు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని ఖమ్మానికి, డి.శ్రీధర్బాబును రంగారెడ్డికి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని వరంగల్కు, హైదరాబాద్కు పొన్నం ప్రభాకర్ను, కొండా సురేఖను మెదక్కు, అనసూయ సీతక్కను ఆదిలాబాద్, నల్గొండకు తుమ్మల నాగేశ్వరరావును, నిజామాబాద్కు జూపల్లి కృష్ణారావును ఇప్పటికే ఇన్చార్జిలుగా నియమించారు. వారితో ప్రత్యేకంగా సమావేశమైన రేవంత్రెడ్డి కీలక సూచనలు చేసినట్లు తెలిసింది. ఈ కార్యక్రమం సజావుగా సాగేలా అధికారులతో ఒత్తిడి తేవడంతో పాటు నిరంతరం పర్యవేక్షించాలని వారికి తెలిపారు. తొలిదఫా విజయవంతం అయితేనే ప్రజల నమ్మకాన్ని చురగొంటామని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాపాలనను సక్సెస్ఫుల్గా నడిపించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అయితే రేవంత్ ఆదేశాలను, సూచనలను మంత్రులు ఎంత వరకూ అమలు చేస్తారనేది ఆసక్తికరంగా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE