ఢిల్లీలోని నిజాముద్దీన్ పరిధిలోని మర్కజ్ లో జరిగిన మతప్రార్థనల్లో పాల్గొని వచ్చిన ఆరుగురు తెలంగాణ వాసులు కరోనా లక్షణాలతో వివిధ ఆసుప్రతుల్లో మరణించినట్టు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చ్ 13-15 మధ్య ఢిల్లీ నిజాముద్దీన్ పరిధిలోని మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్ సోకిందని, వారిలో తెలంగాణకు చెందిన ఆరుగురు మరణించారని తెలిపారు. గాంధి ఆసుపత్రిలో ఇద్దరు, అపోలో ఆసుపత్రి, గ్లోబల్ ఆసుపత్రి, నిజామాబాద్, గద్వాలలో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్టు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో వీరి ద్వారా కరోనా వైరస్ సోకే అవకాశం ఉందని అనుమానిస్తున్న వారందరిని ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి, ఆసుపత్రులకు తరలిస్తున్నాయని అన్నారు. ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరు తమంతట తాముగా, విధిగా సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ కోరింది. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స కూడా అందిస్తుందని, వారి గురించి ఎవరికి సమాచారం ఉన్నా వెంటనే ప్రభుత్వానికి తెలియపరచాలని వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది.
[subscribe]