భద్రాద్రిలో ఏప్రిల్ 2 జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం శ్రీరామనవమి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని, రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఈసారి కళ్యాణోత్సవ వేడుకలకు భక్తులకు అనుమతించడం లేదని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రకటించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 2 , గురువారం నాడు స్వామివారి ఆలయంలోనే శ్రీరామనవమి వేడుకలను ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించనున్నామని తెలిపారు. ఈ వేడుకలను భక్తులంతా ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీల్లో వీక్షించాలని పేర్కొన్నారు.
మరోవైపు భద్రాద్రి దేవస్థానంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు మార్చ్ 29, ఆదివారం నాడు అంకురార్పణ జరిగింది. ఆలయంలో ఉత్సవాలు నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అర్చకులు ప్రాకార మండపం వద్దకు శ్రీసీతారాముల వారిని తీసుకొచ్చారు. అలాగే గోదావరి నుంచి అర్చక స్వాములు తీర్థబిందె తీసుకొచ్చి ఆలయ సంప్రోక్షణ చేశారు. మార్చ్ 30 ,సోమవారం ఉదయం గరుడ పటన లేఖన పూజలు ఘనంగా నిర్వహించారు.
భద్రాద్రి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు:
- మార్చ్ 31, మంగళవారం నాడు అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం.
- ఏప్రిల్ 1, బుధవారం నాడు ఎదుర్కోలు ఉత్సవం.
- ఏప్రిల్ 2, గురువారం నాడు శ్రీసీతారాముల కల్యాణం.
- ఏప్రిల్ 3, శుక్రవారం నాడు శ్రీరామ మహాపట్టాభిషేకం వేడుకలు.
[subscribe]