గురువారం హైదరాబాద్ జింఖానా గ్రౌండ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టీ20 మ్యాచ్ టిక్కెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడటంతో పోలీసులు లాఠీ ఛార్జ్ జరిపారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో.. హైదరాబాద్ అడిషనల్ సీపీ చౌహాన్ స్పందించారు. తొక్కిసలాటలో ఎవరూ మరణించలేదని స్పష్టం చేసిన ఆయన, ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయని తెలిపారు. ఘటనపై పూర్తి విచారణ జరుపుతామని ఆయన వెల్లడించారు. కాగా ఈ నెల 25వ తేదీన భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగనున్న ఆఖరి టీ20 మ్యాచ్ టికెట్లను సికింద్రాబాద్లోని జింఖానా మైదానంలో గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విక్రయించనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ప్రకటించింది. ఒక్కొక్కరికి రెండు టికెట్లు మాత్రమే విక్రయిస్తామని, టికెట్లు కొనేందుకు వచ్చేవాళ్లు ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని హెచ్సీఏ సూచించింది.
దీంతో గురువారం ఉదయం నుంచే క్రికెట్ అభిమానులు వేల సంఖ్యలో జింఖానా మైదానం వద్ద బారులు తీరారు. ఇక మహిళలు కూడా పెద్ద ఎత్తున టికెట్స్ కోసం క్యూలైన్లలో నిలబడ్డారు. అయితే అంచనాలకు మించి అభిమానులు తరలిరావడంతో పాటు ఒకేసారి టికెట్ల కోసం ఎగబడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీనిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ జరిపారు. దీంతో జింఖానా పరిసరాల్లో మరింత గందరగోళం చెలరేగింది. ఏం జరుగుతుందో అర్ధం అయ్యే లోపే ఒకరినొకరు తోసుకుంటూ అటూఇటూ పరుగులు తీశారు. ఈ క్రమంలో పలువురు అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 20మంది స్పృహ తప్పిపడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ పరిణామంతో అభిమానులు మండిపడుతున్నారు. హెచ్సీఏ అధికారుల సమన్వయ లోపం వల్లనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు మూడు వేల టికెట్ల కోసం దాదాపు 30వేల మందికి పైగా అభిమానులు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY