మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణలోని ప్రధాన పార్టీల నేతల మధ్య క్రమంగా మాటల యుద్ధం మొదలవుతోంది. ఈ క్రమంలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి కేటీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి తనపై మరియు తన సోదరుడిపై చేసిన ‘కోవర్టు’ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి మండిపడ్డారు. కాగా మంత్రి కేటీఆర్ ఈరోజు ఒక సమావేశంలో మాట్లాడుతూ.. వారు కోమటిరెడ్డి బ్రదర్స్ కాదని, కోవర్టు రెడ్డి బ్రదర్స్ అని పేర్కొన్నారు. ఈ కామెంట్స్పై స్పందించిన ఎంపీ కోమటిరెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో రబ్బరు బుల్లెట్లు తిన్న మేము కోవర్టులమా? అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎంపీ.. మీ అవినీతి చిట్టా మొత్తం నాకు తెలుసని, నా జోలికి వస్తే మీ చిట్టా విప్పుతానని హెచ్చరించారు. కాంట్రాక్టులు చేసుకుంటే తప్పేముందని, మీలాగా మేము కమీషన్లు తీసుకోవడం లేదని ఎంపీ కోమటిరెడ్డి విమర్శించారు.
తాను దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటున్నా.. ఇప్పటికీ కిరాయి ఇంట్లోనే ఉంటున్నానని, డబ్బుపై తనకు అంత వ్యామోహం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. అయినా మునుగోడులో పోటీ చేస్తోంది తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి అయితే, దీనిలోకి తననెందుకు లాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్న తనను కోవర్టు అనడం ఏంటని, మంత్రి కేటీఆర్ వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని తనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. సొంత పార్టీ నేతలు తనపై చేసిన వ్యాఖ్యలు మనస్తాపం కలిగించాయని, అందుకే తాను మునుగోడు ప్రచారానికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. ఇక తన విదేశీ పర్యటన పూర్తిగా వ్యక్తిగత విషయమని, దీనిపై ఆరోపణలు చేసేవారికి తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ఎంపీలలో ఒక్కరు కూడా పార్టీ మారరని, తనకు అధిష్టానమే ఫైనల్ అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY