తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగస్టు 9వ తేదీ నుండి హైదరాబాద్ భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయం నుంచి “మహా పాదయాత్ర” చేపట్టనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పాదయాత్ర ప్రారంభాన్ని తాజాగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతుండడంతో ముఖ్యమైన బిల్లుల దృష్ట్యా బండి సంజయ్ సమావేశాలకు హాజరు కావాల్సి ఉండడంతో పాదయాత్ర ప్రారంభాన్ని ఆగస్టు 24వ తేదికి వాయిదా వేశామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.
మరోవైపు తెలంగాణ నుంచి తొలిసారిగా కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జి.కిషన్ రెడ్డి, రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఆగస్టు 16,17,18వ తేదీల్లో జన ఆశీర్వాద యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. కిషన్ రెడ్డి యాత్ర 16వ తేదీన కోదాడ నుంచి ప్రారంభం కానుండగా, అక్కడి నుంచి మూడు రోజుల పాటుగా ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, రామప్ప, వరంగల్, జనగామ,యాదాద్రి భువనగిరిల జిల్లాల మీదుగా హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం వరకు యాత్రను నిర్వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ