హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్లో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన మహాధర్నాలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించారు. “కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఎడ్లు లేవు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి బండి లేదు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ గొడవ చేయడం విడ్డూరం. రాష్ట్రంలో 6500 పైచిలుకు కొనుగోలు కేంద్రాలకు గాను 5 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో ఉత్తరాది రైతాంగం ఉడికిపోతుంది. కేంద్రం దక్షిణాదిన మంట పెట్టొద్దు, రైతుల సహనానికి పరీక్ష పెట్టకండి. దేశం కోసం ధర్మం కోసం తెలంగాణ రైతుల ధాన్యం కొంటామని లిఖిత పూర్వకంగా రాసివ్వండి” అని మంత్రి డిమాండ్ చేశారు.
“తెలంగాణ రాష్ట్ర రైతులకు ఈ పరిస్థితి రావడం దురదృష్టకరం. కేంద్రం అస్పష్ట, హేతుబద్ధత లేని విధానాల మూలంగా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రజాప్రతినిధులు ధర్నాకు దిగాల్సి వచ్చింది. ఏడేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అద్భుతాలు సృష్టించుకున్నాం. రెండు, మూడు పంటలు పండించుకుంటూ రైతన్నలు సంతోషంగా ఉన్న ఈ పరిస్థితులలో కేంద్రం చర్య అనాలోచితం. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రైతులు పంటలు పండించుకుంటున్నారు. కేవలం వరి ధాన్యం కొనుగోలుకు కేంద్రం ఎందుకు ఒప్పుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వ తలాతోకాలేని విధానాలు రైతాంగానికి శాపంగా మారాయి. తెలంగాణలో 62.13 లక్షల ఎకరాలలో ఈ వానాకాలం వరి సాగు చేశారు. కానీ కేంద్రం మాత్రం ఇన్ని ఎకరాలలో సాగు చేశారా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారు. తెలంగాణ వ్యవసాయ డాటాను గతంలో కేంద్రమే అభినందించింది. కానీ ఇప్పటికీ ఎంత వరి ధాన్యం కొంటారో స్పష్టత ఇవ్వడం లేదు. దేశంలోనే అత్యధిక ధాన్యం తెలంగాణ నుండి సేకరించామని కేంద్ర ప్రభుత్వమే తెలిపింది. కేంద్రం తన నిర్ణయాలను సమీక్షించుకుని తెలంగాణకు సహకారం అందించాలి. ఉత్తరాదిన వానాకాలం వరి సాగు చేయరు, దక్షిణాదిన, అందునా తెలంగాణలోనే అత్యధిక శాతం వరి పండించేది, తర్వాత ఆంధ్రలోనే.. మిగతా రాష్ట్రాలలో పండదు కాబట్టి పండే రాష్ట్రాలను ప్రోత్సహించాలి. కరోనా విపత్తులో ప్రపంచంలో అన్నీ బంద్ అయినా అన్నం పెట్టే అన్నదాత వృత్తి వ్యవసాయం బంద్ కాలేదు” అని మంత్రి పేర్కొన్నారు.
“కోట్లాది మంది ఆధారపడిన వ్యవసాయ రంగం కోసం కేంద్రం తన నిర్ణయాలను సమీక్షించుకోవాలి. కేసీఆర్ నాయకత్వంలో అంతిమ విజయం కోసం ఐకమత్యంతో పోరాడుదాం. రైతుకు నష్టం చేసిన ఏ ప్రభుత్వం ముందలపడలేదు. నీళ్ల కోసమే యుద్దం మొదలుపెట్టి నీళ్లలో నిప్పులు పుట్టించి ప్రజాస్వామ్యబద్దంగా పార్లమెంటును ఒప్పించి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉంది. అద్భుతమైన ప్రాజెక్టులతో సాగునీటి వసతి కల్పించి బ్రహ్మాండమైన పంటల సాగుకు బాటలు వేశారు. మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్దరణతో భూగర్భ జలాలు పెరిగాయి, 24 గంటల కరంటు ఉచితంగా సరఫరా, రైతు బంధు, రైతు భీమా పథకాలతో భీడువడ్డ పొలాలను వలసెల్లిన రైతులు, విదేశాలకు వెళ్లిన వారు తిరిగి సాగులోకి తీసుకొచ్చారు. ఇంతటి ఘనత సాధించిన తెలంగాణ వ్యవసాయానికి కేంద్రం ప్రోత్సాహం ఇవ్వకుండాల చేతులెత్తేయడం అన్యాయం. కేంద్ర వెంటనే తెలంగాణ ధాన్యం కొనుగోలుకు అనుకూలంగా లిఖితపూర్వక ఉత్తర్వులు ఇవ్వాలి” అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ