ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బార్ల లైసెన్సులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న బార్ల సంఖ్యను 40 శాతానికి తగ్గించాలని ఆదేశాలు జారీ చేశారు. 797 బార్లలో 40శాతం అనగా 319 మూసివేసి మిగిలిన 60 శాతం అనగా 478 బార్లకు జనవరి 2020 నుంచి కొత్తగా లైసెన్సులు జారీ చేయనున్నారు. ఈ మేరకు 2020-21 సంవత్సరానికి గాను బార్ పాలసీని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతరం రాష్ట్రంలో 478 బార్ల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తుల్ని ఆహ్వానించింది. అందుకు సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్లో దరఖాస్తుల స్వీకరణకు ఆఖరి తేదీ డిసెంబర్ 5గా నిర్ణయించారు.
కొత్తగా జారీ చేయబోయే బార్ లైసెన్సులకు ఎక్కువుగా స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో మళ్లీ మరో రోజు గడువు పెంచుతూ సవరణ నోటిఫికేషన్ జారీ చేశారు. డిసెంబర్ 6, శుక్రవారం రాత్రికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి 301 దరఖాస్తులు అందాయి. అలాగే 45 మున్సిపాలిటీల పరిధిలోని బార్లకు కనీసం ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దీంతో గడువును డిసెంబరు 9వ తేదీ వరకు పొడిగిస్తూ ఎక్సైజ్ కమిషనర్ రెండో సవరణ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ బార్లకు సంబంధించిన కొత్త పాలసీ జనవరి 1, 2020 నుంచి డిసెంబర్ 31, 2021 వరకు రెండేళ్లపాటు అమలులో ఉంటుంది. గతంలో ఉన్న బార్ లైసెన్సు దరఖాస్తు ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 50 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్సు ఫీజును ఏడాదికి రూ.25 లక్షలుగా, 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉంటే రూ.50 లక్షలు, ఐదు లక్షలకు పైగా జనాభా ఉంటే లైసెన్సు ఫీజును రూ.75 లక్షలుగా నిర్ణయించారు. లాటరీ విధానం ద్వారా త్వరలో ఈ బార్ల కేటాయింపు చేపట్టనున్నారు.
[subscribe]