ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం బీహార్ రాష్ట్రంలో పర్యటించి, గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన ఐదుగురు బీహార్ కు చెందిన జవాన్ల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున మరియు ఇటీవల హైదరాబాద్ లోని టింబర్ డిపోలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్ధిక సాయాన్ని చెక్కుల రూపంలో అందించారు. ఈ కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ పాల్గొన్నారు. అందులో భాగంగా పాట్నాలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, గాల్వాన్ లోయలో అసువులు బాసిన అమర సైనికుల కుటుంబాలకు, హైదరాబాద్ దుర్ఘటనలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రణామాలు తెలిపారు. “అమరులైన సైనికుల కుటుంబాలకు సహాయం చేయాలని ఎంతో కాలంగా హృదయం భారంగా ఉండేది. అందుకే పాట్నాకు వచ్చి ఈ పవిత్ర భూమికి చెందిన అమరులైన సైనికులకు మా వంతు సహాయం చేస్తున్నాం. కోల్పోయిన ప్రాణాలను మేము తిరిగి తీసుకురాలేం. అమరులైన సైనికుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉండాలనే సందేశం అందరికీ చేరాలి. దీంతో సైనికులకు, దేశ రక్షణ దళాలకు ఆత్మస్టెర్యం పెరుగుతుంది” అని అన్నారు.
“తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అభివృద్ధి బాటలో సాగుతున్న యువ రాష్ట్రం. ఈ రాష్ట్రాభివృద్ధిలో బీహార్ కు చెందిన వేలమంది శ్రామికులు భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు. వీరు ఎన్నో రంగాల్లో పని చేస్తున్నారు. గొప్ప ప్రభుత్వంగా చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో ప్రత్యేక రైళ్ళను నడపాలని కోరినా పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చిన బీహార్ రాష్ట్రం వారైనా, వేరే రాష్ట్రం వారైనా, వారిని తెలంగాణ ప్రతినిధులుగా భావిస్తున్నామని నేను ఆ సమయంలో చెప్పాను. అందుకే వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నాము. కరోనా సమయంలో ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేసి ఎంతో మంది కార్మికులు, శ్రామికులను వారివారి రాష్ట్రాలకు తరలించాం. పని కోసం తెలంగాణకు వలస వచ్చిన వారందరికి మా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం ఉందని మేము భావిస్తున్నాం. మేము గోదావరి నది ఒడ్డు నుండి గంగా నది ఒడ్డుకు వచ్చాం. గంగా నదిని పవిత్రనదిని భావించనట్లుగానే తెలంగాణలో గోదావరి నదిని దక్షిణ గంగగా భావిస్తాం. జయ ప్రకాశ్ నారాయణ్ జన్మించిన పవిత్ర భూమి బీహార్. బీహార్ ప్రజల చైతన్యంతో ప్రారంభమయ్యే ప్రతీ మార్పు ఈ దేశంలో శాంతికి దారి తీసింది. బీహార్ లోని నలంద విశ్వవిద్యాలయం ఎంతో చారిత్రకమైంది. ఇక్కడికి వచ్చి ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు సంతోషంగా ఉంది” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY