తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్లో బుధవారం నాడు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గజ్వేల్లో ఆరున్నర ఎకరాల్లో నూతనంగా నిర్మించిన సమీకృత మార్కెట్ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ మోడల్ మార్కెట్ లో మొత్తం ఆరు బ్లాకులున్నాయి. అన్ని రకాల కూరగాయలు, పండ్లు, మాంసాహారం ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. అలాగే సిద్ధిపేట జిల్లా ములుగులో నిర్మించిన తెలంగాణ ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కాలేజ్ కోసం ములుగులో విశాలమైన ప్రాంగణంలో భవన సముదాయాన్ని నిర్మించారు. ఈ కళాశాల భవనాలను సుమారు రూ.175 కోట్ల వ్యయంతో నిర్మించినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు, విద్యార్థులతో సీఎం కేసీఆర్ కొద్దిసేపు ముచ్చటించారు. ఈ ఫారెస్ట్ కాలేజీలో ఎమ్మెస్సీ ఫారెస్ట్, బీఎస్సీ ఫారెస్ట్, పీహెచ్డీ ఫారెస్ట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
అనంతరం ములుగులో నిర్మించిన హార్ట్ కల్చర్ యూనివర్సిటీని కూడా సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఉద్యానవనాల అభివృద్ధి, రాష్ట్రంలో రైతాంగానికి నాణ్యమైన విత్తనాలను అందించే పరిశోధన కోసం ములుగు మండల కేంద్రంలో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. మొత్తం 16 ఎకరాల విస్తీర్ణంలో రూ.135 కోట్ల వ్యయంతో ఈ యూనివర్సిటీ భవనాలను నిర్మించారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ పర్యటనలో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్గౌడ్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
[subscribe]