దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువ వైద్యురాలు దిశ హత్యకేసు నిందితుల ఎన్కౌంటర్పై దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్) పై డిసెంబర్ 11, బుధవారం నాడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ ఎన్కౌంటర్పై రిటైర్డు న్యాయమూర్తితో దర్యాప్తు జరిపించే అంశాన్ని పరిశీస్తున్నామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బాబ్డే పేర్కొన్నారు. ఢిల్లీ నుంచే సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి ఈ ఎన్కౌంటర్ కేసును పరిశీలిస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు కోసం రిటైర్డు న్యాయమూర్తి పీవీ రెడ్డిని సంప్రదించగా, ఆయన నిరాకరించారని చెప్పారు. ఎన్కౌంటర్ దర్యాప్తుపై సలహాలు, సూచనలతో రావాలని తెలంగాణ ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టులో ఎన్కౌంటర్పై విచారణ కొనసాగుతున్న విషయాన్ని జస్టిస్ ఎస్ ఏ బాబ్డే ప్రస్తావించారు. అనంతరం ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ముకుల్ రోహత్గి వాదిస్తూ, తమ వాదనలు విన్న తర్వాతే ముందుకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించారు. తమ అభిప్రాయం తెలుసుకోకుండా ఆదేశాలు జారీ చేయొద్దని కోరారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ పై విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేసింది.
[subscribe]