దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సభ్యుల బృందం విచారణకు పూనుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్ పై నాలుగు రోజుల పాటు వివరాలు సేకరించిన ఎన్హెచ్ఆర్సీ బృందం తమ పర్యటనను ముగించుకుని, డిసెంబర్ 11, బుధవారం సాయంత్రం ఢిల్లీకి తిరిగి వెళ్లిపోనున్నారు. ముందుగా ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్హెచ్ఆర్సీ సభ్యుల బృందం మొదటిరోజున మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి చేరుకుని, అక్కడ భద్రపరిచిన నలుగురు నిందితుల మృతదేహాలను పరిశీలించారు. అనంతరం చటాన్పల్లి వంతెన దగ్గర ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని కూడా సందర్శించారు. రెండో రోజున దిశ తండ్రి, సోదరితో పాటు మృతుల తల్లిదండ్రులతో కూడా మాట్లాడి వివరాలు సేకరించారు. నిందితుల ఎన్కౌంటర్పై వారి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు.
అనంతరం ఈ ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీసులను, నిందితుల మృతదేహాలకు పంచనామా నిర్వహించిన తహసీల్దార్లను విచారించి వివరాలు సేకరించారు. అలాగే నలుగురు నిందితులకు సంబంధించిన డీఎన్ఏ, ఫోరెన్సిక్ నివేదికను పోస్టులో ఢిల్లీకి పంపించాలని సైబరాబాద్ పోలీసులకు ఎన్హెచ్ఆర్సీ బృందం సూచించింది. ఏడుగురు సభ్యుల బృందానికి సీనియర్ ఎస్పీ మంజిల్ షైనీ నేతృత్వం వహించారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదికను జాతీయ మానవ హక్కుల కమిషన్ కు సమర్పించనున్నారు.
[subscribe]