ఉత్తరప్రదేశ్ లోని హాథ్రాస్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అక్కడి పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై యూపీ పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ తెలంగాణ బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సహా, పలువురు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. పోలీసులు అడ్డుకున్నా కూడా రేవంత్ రెడ్డి బీజేపీ కార్యాలయం వైపు దూసుకెళ్లారు.
కార్యాలయ ముట్టడికి కాంగ్రెస్ నాయకులు వస్తున్నారన్నా సమాచారంతో బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి తీవ్రతతో రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోవైపు కాంగ్రెస్ నేతల చర్యకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ వైపుకు దూసుకెళ్లారు. బీజేపీ కార్యకర్తలు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరు పార్టీల కార్యకర్తల ర్యాలీలతో పార్టీ కార్యాలయాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu