ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం, ఫ్రెండ్లి పోలీసింగ్, మౌలిక సదుపాయాల కల్పన, పోలీసు శాఖలో రిక్రూట్మెంట్ డ్రైవ్లను అందించడం ద్వారా పోలీసు శాఖకు మహేందర్ రెడ్డి అపారమైన సేవలందించారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ అన్నారు. నేడు పదవీ విరమణ చేసిన డీజీపీ మహేందర్ రెడ్డిని బీ.ఆర్.కే.ఆర్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్ ఘనంగా సత్కరించారు. డీజీపీగా మహేందర్ రెడ్డి నిరంతరం అన్ని శాఖల అధికారులకు, వివిధ వర్గాలకు అందుబాటులో ఉండడంతోపాటు అన్ని శాఖలతో సత్సంబంధాలు కొనసాగించారని అన్నారు.
డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ, తెలంగాణ పోలీసులు ఇతర రాష్ట్రాలకే కాకుండా ఇతర దేశాలకు చెందిన వారు కూడా పోలీస్ శాఖ పనితీరును ప్రశంసిస్తున్నారని అన్నారు. అన్ని శాఖల సమన్వయం, మద్దతు వల్లే పోలీస్ శాఖ రాష్ట్రంలో మెరుగైన శాంతి భద్రతలు కల్పిస్తోందని పేర్కొన్నారు. మహేందర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆధునిక పద్ధతులు, మెరుగైన విధానాలను తాను కొనసాగిస్తానని అంజనీ కుమార్ స్పష్టం చేశారు.
కాగా తాను పోలీసు శాఖలో పనిచేసినప్పటికీ, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే అనేక సమస్యలను పరిష్కరించవచ్చనే భావంతోనే ప్రభుత్వంలోని అన్ని శాఖలతో కలిసి పనిచేశానని పదవీ విరమణ చేసిన డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. ప్రస్తుత కాలంలో సాంకేతికతను అందిపుచ్చుకునే సంస్థలు మాత్రమే మనుగడ సాగిస్తాయని, పోలీసు శాఖ పనితీరులో సాంకేతికతను తీసుకురావడం కోసం తాను నిరంతరం కృషి చేశానని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్, కమాండ్ కంట్రోల్ సిస్టమ్ మొదలైనవి పోలీసు శాఖలో తీసుకొచ్చిన కొన్ని కార్యక్రమాలతో డిపార్ట్ మెంట్ పనితీరులో మంచి ఫలితాలను పొందామని స్పష్టం చేశారు. అదేవిధంగా నేరం జరిగిన 24 గంటల్లోనే అనేక కేసులను ఛేదించడంలో సీసీటీవీ ప్రాజెక్ట్ పోలీసులకు సహాయపడిందన్నారు. కమ్యూనిటీ, ఎన్జీవోలు, సివిల్ సొసైటీలతో భాగస్వామ్యంతోనే రాష్ట్రంలో పది లక్షలకు పైగా సీసీటీవీలు ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు. రాష్ట్ర శాంతి, ప్రగతి ఉమ్మడి లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని శాఖల సమన్వయం అవసరమని ఆయన నొక్కి చెప్పారు.
అంతకుముందు చీఫ్ అడ్వైజర్ రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్ లు పదవీ విరమణ చేసిన డీజీపీ మహేందర్రెడ్డి, డీజీపీ అంజనీకుమార్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, ప్రస్తుత హోంశాఖ కార్యదర్శి జితేందర్లను సత్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, ఏసీబీ ఏడీజీ రవిగుప్తాలు మహేందర్ రెడ్డితో ఉన్న అనుబంధాలను గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE