నాలాల సమగ్ర అభివృద్ధితోనే వరదముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మినిస్టర్ రోడ్ లో పికెట్ నాలాపై ఎస్ఎన్డీపీ కార్యక్రమం క్రింద చేపట్టిన వంతెన పునర్నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించిన నాలాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, నాలాలు ఆక్రమణలకు గురికావడం వంటి కారణాలతో ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నాలాకు ఎగువ నుండి వచ్చే నీరు సక్రమంగా వెళ్ళక పరిసర కాలనీలు వరద ముంపుకు గురవుతున్నాయని చెప్పారు. పికెట్ నాలా వంతెన కూడా ప్రస్తుతం నీటి వరద ప్రవాహానికి అనుగుణంగా లేకపోవడం వలన వరద ముంపు సమస్య ఏర్పడుతుందని అన్నారు.
ఈ సమస్య పరిష్కారం కోసమే ఎస్ఎన్డీపీ కార్యక్రమం క్రింద 20 కోట్ల రూపాయల వ్యయంతో వంతెన పునర్నిర్మాణ పనులు, కళాసీగూడ నాలా విస్తరణ పనులను చేపట్టినట్లు వివరించారు. పునర్నిర్మాణ పనులలో భాగంగా గతంలో 12 మీటర్లు ఉన్న వంతెనను 22 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 20 మీటర్ల వెడల్పుతో ఉన్న రోడ్డును 30 మీటర్లకు విస్తరించడం జరుగుతుందని అన్నారు. వంతెన నిర్మాణ పనులు చేపట్టిన ప్రాంతంలో మంచినీటి సరఫరా పైప్ లైన్, 132 కేవీ విద్యుత్ లైన్ లు ఉన్నాయని, ఆయా శాఖల అధికారుల సమన్వయంతో పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే కంటోన్మెంట్, ఆసియా ఖండంలోనే అతిపెద్ద బస్తీగా ఉన్న రసూల్ పురాబస్తీ, అన్నానగర్, బీహెఛ్ఈఎల్ కాలనీ, ఇక్రిశాట్ తదితర కాలనీల ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE