హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. ఉప్పల్ స్టేడియం లో ఈ పోలింగ్ పక్రియను నిర్వహించారు. పోలింగ్ అనంతరం కొద్దిసేపటి క్రితమే అధ్యక్షుడిగా అజారుద్దీన్ ఎన్నికయినట్టు అధికారులు ఫలితాలు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో మహమ్మద్ అజారుద్దీన్ తో పాటు ప్రకాష్చంద్ జైన్, దిలీప్ కుమార్ కూడ హెచ్సీఏ అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు.
ఈ హెచ్సీఏ అధ్యక్ష ఎన్నికలలో మొత్తం 227 సభ్యులకు గాను 223 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడు ప్యానెళ్లు బరిలోకి దిగినా కూడ పోటీ అజారుద్దీన్, ప్రకాష్చంద్ జైన్ ప్యానెళ్ల మధ్యనే నడిచింది. అజారుద్దీన్ కు 147 ఓట్లు రాగా, ప్రకాష్చంద్ జైన్ కు 73 ఓట్లు వచ్చాయి, మరో అభ్యర్థి దిలీప్ కుమార్ కు కేవలం మూడు ఓట్లు మాత్రమే లభించాయి. అజహర్ 74 ఓట్ల ఆధిక్యంతో ఘనవిజయం సాధించారు. 2017లో ఒకసారి అజారుద్దీన్ హెచ్సీఏ అధ్యక్ష పదవికి వేసిన నామినేషన్ తిరస్కరించడంతో ఈసారి ఆయన గెలుపుకోసం పూర్తి కసరత్తు చేసి బరిలోకి దిగారు. ఆయన బరిలో ఉండడంతో పోటీ ఆసక్తికరంగా మారడంతో పాటు, చివరకు విజయం కూడ అజారుద్దీన్ నే వరించింది.