తెలంగాణ రాష్ట్రప్రభుత్వం “దళిత బంధు” పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి నేడు(ఆగస్టు 16, సోమవారం) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణ శివారులోని శాలపల్లిలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన దళిత బంధు ప్రారంభోత్సవ బహిరంగ సభ జరుగుతుంది. ముందుగా శాలపల్లి సభలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ చిత్ర పటాలకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ఈ వేదికపై దళిత బంధు కింద 15 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున సీఎం కేసీఆర్ చెక్కులను అందించారు. ఈ సభకు రాష్ట్ర మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, దళితబంధు ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదని, ఒక మహా ఉద్యమమని అన్నారు. ఈ ఉద్యమం కచ్చితంగా విజయం సాధించి తీరుతుందని పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్ నియోజకవర్గంలో వచ్చే ఒకట్రెండు నెలల్లో 21 వేలకుపైగా దళిత కుటుంబాలకు దళిత బంధు నిధులను ప్రభుత్వం అందజేయనుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమం అప్పటి తొలి సింహ గర్జన నుంచి రైతు బంధు సహా నేటి వరకు బ్రహ్మాండమైన పథకాలకు సెంటిమెంట్ గా, విజయవంతంగా కరీంనగర్ జిల్లా నిలిచిందని, ఈ నేపథ్యంలోనే దళిత బంధు వంటి అద్భుతమైన పథకాన్ని కూడా కరీంనగర్ జిల్లా నుంచే శ్రీకారం చుడుతున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఏడాది క్రితమే దళిత బంధును ప్రారంభించాలని అనుకున్నామని, కానీ కరోనా పరిస్థితుల కారణంగా ఏడాది ఆలస్యం అయిందని చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగులకు దళితబంధు, మరో 15 రోజుల్లో ఇంకో 2 వేల కోట్లు విడుదల:
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల పైచిలుకు దళిత కుటుంబాలు ఉన్నాయన్నారు. రైతుబంధు తరహాలోనే దళిత బంధు అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న దళిత కుటుంబాలకు కూడా దళిత బంధును వర్తింపజేస్తామని, అయితే వారికీ చివరివరుసలో అందజేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. దళితుల్లో నిరుపేదలుగా ఉన్న కుటుంబాలకు ముందుగా దళిత బంధు నిధులు అందిస్తామన్నారు. హుజురాబాద్ కు రాబోయే 15 రోజుల్లో ఈ పథకం కోసం ఇంకో 2 వేల కోట్లు విడుదల చేస్తామని చెప్పారు. ఈ పథకం అమలులో ఎవరికీ అనుమానాలు అవసరం లేదని, విజయవంతంగా అమలు జేస్తామన్నారు. దళితబంధు నిధులతో నచ్చిన పని చేసుకోవచ్చని చెప్పారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా దళిత బంధుపై చర్చ జరుగుతుందని, ప్రపంచవ్యాప్తంగా ఈ ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. మరోవైపు ఎస్సీ వేల్పేర్ శాఖ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న రాహుల్ బొజ్జాను సీఎంఓలో సెక్రటరీగా నియమిస్తున్నట్టుగా ఈ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ