ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నాడు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో పాఠశాలల్లో అన్ని జాగ్రత్తలు పాటించేలా విద్యా శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వారితో పాటుగా, ఇంటర్మీడియట్ రెండో ఏడాది విద్యార్థులకు కూడా నేటి నుంచే ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల రాకతో దాదాపు నాలుగు నెలల తర్వాత పాఠశాలల వద్ద మళ్ళీ సందడి నెలకుంది. పాఠశాలల్లో మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ అందుబాటులో ఉంచడం తప్పనిసరి చేశారు.
మరోవైపు రాష్ట్రంలో నూతన విద్యావిధానం (5+3+3+4) అమలు చేయనున్నారు. రాష్ట్రంలో పాఠశాలలను ఆరు రకాలుగా వర్గీకరణ చేశారు. శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు (పీపీ–1, పీపీ–2), ఫౌండేషనల్ (పీపీ–1, పీపీ–2, 1, 2 తరగతులు), ఫౌండేషనల్ ప్లస్ (పీపీ–1 నుంచి 5వ తరగతి వరకూ), ప్రి హైస్కూల్స్ (3వ తరగతి నుంచి 7 లేదా 8వ తరగతి వరకూ), హైస్కూళ్లు (3వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ), హైస్కూల్ ప్లస్ స్కూళ్లు (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ) గా వర్గీకరణ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో పాటించాల్సిన మార్గదర్శకాలు ఇవే:
- 10 శాతం కన్నా తక్కువ కరోనా పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లోనే పాఠశాలలు తెరవాలి.
- అన్ని పాఠశాలల్లో కరోనా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి.
- విద్యార్థులు తమ తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతితోనే తరగతులకు హాజరు కావాలి.
- ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రతిరోజూ పాఠశాలలకు హాజరు కావాలి.
- గతంలో లాగా రెగ్యులర్ సమయం ప్రకారమే తరగతులు నిర్వహించాలి.
- థర్మల్ స్కానర్తో పాఠశాల ప్రవేశద్వారం వద్దే విద్యార్థులను పరిశీలించాలి.
- ప్రాంగణంలో శానిటైజర్ ఏర్పాటు చేసి, చేతులు శుభ్రం చేసుకోవడంపై విద్యార్థులకు సూచనలు ఇవ్వాలి.
- తరగతి గదుల్లో 6 అడుగుల భౌతిక దూరంతో సీటింగ్ ఏర్పాట్లు చేయాలి.
- పిల్లల సంఖ్యకు తగిన విధంగా గదులు/వసతి లేని చోట తరగతులను రోజు విడిచి రోజు నిర్వహించాలి.
- పాఠశాల లోపల మరియు బయట పరిసరాల్లోనూ కూడా శానిటైజేషన్ నిర్వహించాలి.
- పాఠశాల అసెంబ్లీ, గ్రూప్ వర్కులు, గేమ్స్ వంటివి నిర్వహించకూడదు.
- ప్రతి వారంరోజులకి ప్రతి స్కూలులో ఇద్దరు విద్యార్థులు, సిబ్బంది నుంచి ఒకరికి ర్యాండమ్ గా కరోనా పరీక్షలు నిర్వహించాలి.
- పాఠశాలల నుంచి ఇంటికి వెళ్లిన వెంటనే ప్రతి విద్యార్థి స్నానం చేసేలా విద్యార్థులకు సూచనలు/అవగాహన కల్పించాలి.
- పాఠశాలల్లో కరోనా నిబంధనలు అమలుకు టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలి.
- వ్యాక్సినేషన్ పూర్తికాని ఉపాధ్యాయులు, సిబ్బందికి వెంటనే వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ