కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో 2019–20 విద్యా సంవత్సరంలో జరగాల్సిన పరీక్షలు, వృత్తి విద్యా, సాంకేతిక విద్యకు సంబంధించి పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ అమలులో భాగంగా కేంద్రప్రభుత్వం దశలవారీగా గణనీయమైన సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పీజీ ప్రవేశాలతో సంబంధం ఉండడంతో ముందుగా తృతీయ సంవత్సరం డిగ్రీ పరీక్షలను నిర్వహించాలని యూనివర్సిటీలు భావించగా, కొన్ని ఇబ్బందులు ఎదురవుతుండడంతో అన్ని సంవత్సరాల డిగ్రీ విద్యార్థులకు జూన్ 20 వ తేదీ నుంచి ఒకేసారి పరీక్షలను నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
కేవలం తృతీయ సంవత్సరం విద్యార్థులకు ముందుగా పరీక్షలు నిర్వహిస్తే, వారిలో గత రెండు సంవత్సరాల్లో సబ్జెక్ట్స్ ఫెయిల్ అయి ఉంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ఒకేసారి పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. మరోవైపు ప్రశ్న పత్రంలోనూ మార్పులు చేయనున్నట్టు తెలుస్తుంది. ప్రశ్నలను తగ్గించి, ఎక్కువ ఆప్షన్లు ఇవ్వడంతో పాటుగా ఒక్కో ప్రశ్నకు గతంలో కన్నా ఎక్కువ మార్కులు కేటాయించనున్నట్టు సమాచారం. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం నిబంధనలు అమలు చేస్తూ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu