మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులని తెలంగాణ డీజీపీ కే.మహేందర్ రెడ్డి అన్నారు. జూలై 18, శుక్రవారం నాడు ఏటూరు నాగారం సబ్ డివిజన్ లోని వెంకటాపురం పోలీస్ స్టేషన్ నందు ములుగు, భూపాలపల్లికి చెందిన పోలీస్ అధికారులతో డీజీపీ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మావోయిస్టులు మళ్లీ తెలంగాణలో ప్రవేశించి హింసాత్మక చర్యలకు పూనుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో తెలంగాణ పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టు ఆగడాలను తెలంగాణ గడ్డ మీద జరగనివ్వబోదని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు అయినటువంటి హరి భూషణ్, దామోదర్ విలాసవంతమైన జీవితాలను గడుపుతూ అమాయక గిరిజనులను బలిపశువులుగా చేస్తున్నారని మావోయిస్టులకు ఎవరూ కూడా సహకరించకుండా ఉండాలని హెచ్చరించారు.
తెలంగాణలో ఉండే డాక్టర్లు ,ఇంజనీర్లను, వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేయాలని పథక రచనతో తిరిగి మళ్లీ తెలంగాణలో అడుగు పెట్టాలని మావోయిస్టు లు చేసే ప్రయత్నాలను తెలంగాణ పోలీస్ శాఖ సమర్థంగా తిప్పి కొడుతుందని తెలియజేశారు. దాదాపు పది సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రజల కోపాగ్నికి గురై ఇక్కడినుంచి ప్రాణభయంతో పారిపోయిన మావోయిస్టులు తిరిగి మళ్ళీ తెలంగాణ ప్రజల కోపానికి గురి కాకూడదని హెచ్చరించారు. తెలంగాణలో ప్రతి గ్రామం రహదారులతో అనుసంధానింపబడి విద్య వైద్యం వంటి సదుపాయాలను పొందుతూ తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్న ఈ సమయంలో మావోయిస్టులు తిరిగి తెలంగాణలో అశాంతి నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇన్ఫార్మర్ల నెపంతో హత్యలకు పాల్పడే మావోయిస్టులకు రానున్న సమయంలో తెలంగాణ పోలీస్ శాఖ గట్టి దెబ్బ కొడుతుందని మావోయిస్టులను హెచ్చరించారు. నక్సలిజం లేకపోవడంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే శరవేగంగా అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దూసుకుపోతుందని డీజీపీ మహేంద్రరెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu