రాష్ట్రంలో మే 7వ తేదీ వరకు అమలులో ఉండే లాక్ డౌన్ ను వివిధ శాఖల సమన్వయంతో మరింత పకడ్బందిగా అమలు చేయనున్నట్టు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 20, సోమవారం సాయంత్రం డీజీపీ కార్యాలయంలో అడిషనల్ డీజీ జితేందర్, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమీషనర్లు అంజనీ కుమార్, మహేష్ భగవత్, సజ్జనార్, ఐజీ స్టీఫెన్ రవీంద్ర లతో కలసి డీజీపీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అత్యంత ప్రమాదకరమైన కరోనా వ్యాధి నివారణకై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలను ప్రతి ఒక్కరు కచ్చితంగా పాటించాలని, ఈ విషయంలో పోలీస్ శాఖ మరింత కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.
డీజీపీ మహేందర్ రెడ్డి ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు:
- కేవలం తమ ఇంటి నుండి కేవలం మూడు కిలోమీటర్ల దూరంవరకే నిత్యావసర వసువులకై రావాల్సి ఉంటుందని, ప్రతి ఒక్కరు తమ నివాస గుర్తింపు కార్డును తమ వద్ద తప్పక ఉంచుకోవాలని స్పష్టం చేశారు.
- ఆస్పత్రులకు వెళ్లేవారు అందుకు సంబంధించిన ప్రూఫులు, రెసిడెన్స్ ప్రూఫ్ లు వెంట ఉంచుకోవాలి.
- సాధారణ జబ్బులకు స్థానిక ఆస్పత్రులకు వెళ్లాలని సూచించారు.
- నిబంధనలు ఉల్లంఘించిన లక్షా ఇరవై వేలకు పైగా వాహనాలను ఇప్పటికే సీజ్ చేశామని, లాక్డౌన్ పూర్తయ్యాక ఆయా వాహనాలను కోర్టులో డిపాజిట్ చేస్తామని, కోర్టు ద్వారానే వాహనాలను వాటి యజమానులు తీసుకోవాలి.
- నిత్యావసర సరుకుల రవాణా, ఐటీ, ఫార్మా తదితర రంగాలకు చెందిన పలు ఉద్యోగులకు దాదాపు పదిహేను వేలకు పైగా పాసులు జారీ చేశామని, ఈ పాసుల జారీని పునః సమీక్షించనున్నట్టు తెలిపారు.
- ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రోజు విధులకు హాజరయ్యే వారికి ఆరోజుకు సంబందించిన ప్రత్యేక రంగుతో కూడిన పాస్ లను జారీ చేయాలని వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులను కోరనున్నట్టు తెలిపారు.
- సోమవారం నాడు ఎరుపు, మంగళవారం గ్రీన్, బుధవారం పసుపు, గురువారం తెలుపు, శుక్రవారం లేత గులాబీ, శనివారం నీలి రంగు పాసులను జారీ చేయాలని ప్రతిదిస్తున్నామని చెప్పారు.
- ప్రతీ పాస్ పై ఉద్యోగి నివాసం చిరునామా, కార్యాలయ వివరాలు తప్పక ఉండాలని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 329 కంటైన్మెంట్ జోన్ లలో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశామని అన్నారు. - ప్రభుత్వానికి-అధికారులకు ప్రజలందరూ సహకరించాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడ౦ , సోషల్ డిస్టెన్స్ పాటించి ఇతరులకు వైరస్ సోకకుండా జాగ్రత్తగా ఉండాలి.
- మర్కజ్ కు వెళ్లివచ్చిన వారందరినీ పోలీస్ శాఖ గుర్తించిందని వెల్లడించారు.
- నగరంలో ఎవరైనా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే తప్పని సరిగా జీహెచ్ఎంసీ అనుమతితో వారి ద్వారానే చేయాలని, ఫుడ్ డిస్టిబ్యూషన్ చేసే సమయంలో సోషల్ డిస్టెన్స్ ఉండేలా చూసుకోవాలని తెలిపారు.
- లాక్డౌన్ అమలులో పోలీసులకు కాలనీ రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసోషియేషన్ లు సహకరించాలని, ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో ఒకే ఎంట్రీ-ఏక్సిట్ ఉండేలా చూసుకోవాలి.
- రాష్ట్రం లో ఇంటి అద్దెలను అడగవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించి, చట్టం చేసినా తమను ఇంటి అద్దె అడుగుతున్నారని డయల్ 100 కు నేడు 36 ఫిర్యాదులు అందాయని, ఈ విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులపై ఆయా ఇంటి యజమానులను చైతన్య పర్చామని వెల్లడించారు.
- సామాజిక దూరం పాటించడంలేదనే ఫిర్యాదులు ఎక్కువగా డయల్ 100 కు వస్తున్నాయి.
- కరోనా నివారణకై పోలీస్ శాఖ చేస్తున్న కృషిని గుర్తించి పది శాతం అదనపు వేతనాన్ని అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పట్ల పోలీస్ శాఖ తరపున ధన్యవాదాలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]