తెలంగాణ రాష్ట్రంలో మే 7 వరకు లాక్డౌన్ పొడిగిస్తునట్టు ఏప్రిల్ 19, ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, 2020-21 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజులు పెంచకూడదని, ఇతర ఫీజులు లేకుండా కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే నెలవారీగా వసూలు చేయాలనీ వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమిస్తే స్కూళ్ల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్రంలోని స్కూళ్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. జీవో నం.46 ను ఉల్లంఘిస్తే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ జీవో రాష్ట్రంలోని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సహా అన్ని ప్రైవేటు స్కూళ్ళుకు వర్తిస్తుందని, ప్రభుత్వ ఆదేశాలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.
మరోవైపు సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా వైద్యారోగ్య శాఖ, పోలీసు శాఖ, పారిశుద్ధ్య సిబ్బందికి ఏప్రిల్ నెలకు గానూ సీఎం ప్రత్యేక ప్రోత్సాహకాలపై రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాపై చేస్తున్న పోరాటంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందిస్తున్న వైద్యారోగ్య శాఖ సంబంధిత ఉద్యోగులు, పోలీసు శాఖ ఉద్యోగులందరికీ వారీ మూల వేతనంలో 10 శాతం మొత్తాన్ని సీఎం ప్రోత్సాహకంగా ప్రభుత్వం అందజేస్తుంది. అలాగే జీహెచ్ఎంసీ, జలమండలి పరిధిలోని పారిశుద్ధ్య సిబ్బంది, ఇతర కార్మికులకు ప్రోత్సాహకం కింద రూ.7500 అందజేయనున్నారు. కార్పోరేషన్లు, మునిసిపాలిటీలలోని పారిశుద్ధ్య సిబ్బంది, పంచాయతీల్లోని పారిశుద్ధ్య, ఇతర మల్టీపర్పస్ కార్మికులు అందరికీ ప్రోత్సాహకం కింద ప్రభుత్వం రూ. 5 వేలు అందిస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]