తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 20, సోమవారం నాటికి 872 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కరోనా లక్షణాలు కలిగిఉన్న అనుమానితులు తమ శాంపిల్స్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ధేశించిన ఆసుపత్రులకు రావాల్సిన అవసరంలేదని, వారి ఇళ్ల వద్దకే వెళ్లి శాంపిళ్లు సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు. కరోనా అనుమానితుడి ఇంటికెళ్లి అక్కడ సేకరించిన శాంపిళ్లను ప్రత్యేకంగా భద్రపరిచి ఈ వాహనంలో నిర్ధారణ పరీక్షా కేంద్రానికి తీసుకెళ్తారు. ఈ ప్రక్రియకు అవసరమయ్యే అత్యాధునిక రిఫ్రిజిరేటర్లు, ఇతర పరికరాలను కొనుగోలు చేస్తున్నారు. ముందుగా హైదరాబాద్ నగరంలో ఈ వాహన సేవలు ప్రారంభించాలని భావిస్తున్నారు.
అనుమానితుడు నుంచి శాంపిళ్లను సేకరించిన అనంతరం నిర్ధారణ పరీక్షలు ఫలితం వచ్చే వరకు ఆ వ్యక్తులను హోం క్వారంటైన్లోనే ఉంచనున్నారు. ఒకవేళ వారికి పాజిటివ్ నిర్ధారణ అయితేనే ఆసుపత్రికి తరలిస్తారు. ఈ పక్రియ ద్వారా సమయం ఆదా కావడంతో పాటుగా ఎక్కువ శాంపిళ్లను సేకరించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఐసొలేషన్ కేంద్రాల్లో అనుమానితులందరినీ ఒకేచోట ఉంచడం వల్ల, వాళ్లలో ఒకరి నుంచి ఒకరికి వైరస్ సోకే ప్రమాదం ఉందని ఈ పక్రియ ద్వారా అలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు భావిస్తున్నారు. అలాగే ఇకపై మృతి చెందిన వారి నుంచి కరోనా శాంపిల్స్ సేకరించకూడదని వైద్యశాఖ నిర్ణయించింది. కరోనా లక్షణాలతో చనిపోతే పాజిటివ్(డీమ్డ్ టు బి పాజిటివ్)గానే భావించాలని వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]