ఆగస్టు 16, సోమవారం నుంచి రుణమాఫీ మొదలుకానున్న నేపథ్యంలో రైతులోకానికి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం నాడు రూ.25 వేల పైబడి రూ.25,100 వరకు రుణం ఉన్న రైతుల రుణమాఫీపై ట్రయల్ రన్ నిర్వహించామని తెలిపారు. నేటి నుండి ఆగస్టు 30 వరకు రూ.25 వేల నుండి రూ.50 వేల వరకు రుణాలున్న రైతుల రుణాలు మాఫీ జరుగుతుందని, ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.2005.85 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ విడత రుణమాఫీలో రూ.50 వేల వరకు రుణాలున్న 6,06,811 మంది రైతులకు లబ్ది చేకూరుతుందని చెప్పారు.
రైతుబంధు మాదిరిగా కుంట నుండి ఎకరా వరకు, ఎకరా నుండి 2 ఎకరాలు, 2 ఎకరాల నుండి 3 ఎకరాల రైతుల ఖాతాలలో నిధులు జమ చేసిన మాదిరిగా రూ.25 వేలు, రూ.26 వేలు, రూ.27 వేలు చొప్పున రుణమాఫీ రైతుల ఖాతాలలో జమచేసే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. రైతుబంధు తరహాలో వందశాతం విజయవంతంగా పంట రుణమాఫీ ఆన్ లైన్ ద్వారా అమలుచేసేందుకు అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 2014 నుండి 2018 వరకు రూ16,144.10 కోట్ల రైతుల రుణాలు మాఫీ అయ్యాయని, 2018లో రూ.25 వేలలోపు 2.96 లక్షల మంది రైతులకు రూ.408.38 కోట్లు మాఫీ జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ కు రాష్ట్ర రైతాంగం పక్షాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు. సమైక్య పాలనలో నిర్లక్ష్యం చేయబడ్డ వ్యవసాయ రంగానికి ఆసరాగా నిలిచారని, ఆకలితో తండ్లాడిన తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా నిలిపారని కొనియాడారు. పంటల మార్పిడి వైపు రైతులను ప్రోత్సహించి తెలంగాణ వ్యవసాయం దేశానికి ఆదర్శంగా నిలిచేందుకు కృషిచేస్తామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ