తెలంగాణ రాష్ట్రంలో గతకొన్నిరోజులుగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నాడు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఫోన్ లో మాట్లాడారు. కరోనా కేసుల పెరుగుదల, చికిత్సపై సమీక్షించారు. కరోనా ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో రేపు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కరోనా చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల సూపరింటెండెంట్ లు, నోడల్ ఆఫీసర్స్ తో మంత్రి ఈటల రాజేందర్ సమావేశం కానున్నారు.
టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ పద్ధతిని ఖచ్చితంగా అమలు చేయాలి:
ఇటీవల అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనూ పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులను, ఆసుపత్రి బాధ్యులను అప్రమత్తం చేసి, తెలంగాణలో కేసులు పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి ఈటల రాజేందర్ దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కరోనా నిర్ధారణ పరీక్షలు సంఖ్య మరింత పెంచడంతో పాటు టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ పద్ధతిని ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. అయితే కేసుల సంఖ్య పెరుగుతున్న కూడా తీవ్రత తక్కువగా ఉందని అధికారులు సమీక్ష సందర్భంగా మంత్రికి వివరించారు.
కరోనా సమయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సహకారంతో విస్తృత మైన ఏర్పాట్లు చేయడం వల్ల డెత్ రేట్ ను గణనీయంగా తగ్గించగలిగామని మంత్రి అన్నారు. మళ్లీ ఇప్పుడు కేసులు పెరిగిన కూడా సమర్థవంతంగా చికిత్స అందిచగలమని చెప్పారు. వాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతుందని, అయితే అందరికీ వాక్సిన్ అందించడానికి అవసరం అయిన డోసులు పంపించాలని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని కోరామని తెలిపారు. మరోసారి పోలీస్, మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖల సమన్వయంతో ప్రణాళికా చేస్తామని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజల పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మాస్క్ తప్పని సరిగా ధరించాలని కోరారు, భౌతిక దూరం పాటించాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దని మంత్రి ఈటల రాజేందర్ ప్రజలను కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ