తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ రోజు సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డా.రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డా.శ్రీనివాస్ హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉంది. జలుబు జ్వరాలతో బాధ పడే వారి సంఖ్య పెరిగింది. వీటి లక్షణాలు కరోనా లక్షణాలు ఒకే విధంగా ఉంటున్నాయి. అందుకే లక్షణాలు ఉన్న ప్రతిఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామాల నుండి పట్టణాల వరకు అన్నింటిలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇతర శాఖలైన పంచాయతీ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కలిసి పనిచేయాలని సూచించారు. ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించి వ్యాధులు ప్రబలకుండా చూడాలని కోరారు.
రిలీఫ్ క్యాంపులలో లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు:
జీహెఛ్ఎంసీ లో వర్షాలు మొదలైనప్పటినుండి ఇప్పటివరకు 585 మెడికల్ క్యాంపులు నిర్వహించామని, 104 వాహనాల ద్వారా 50 మొబైల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నామని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డా. శ్రీనివాస్ మంత్రికి వివరించారు. ఈ క్యాంపులు ద్వారా ఇప్పటివరకు 38516 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశామని తెలిపారు. 30,367 మందికి మాస్కులు, 2795 మందికి శానిటైసర్లు అందించామని అన్నారు. రిలీఫ్ క్యాంపులలో కరోనా వ్యాప్తి జరగకుండా ఉండేందుకు లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇప్పటివరకు లక్షణాలు ఉన్న 3406 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, ఇందులో 90 మందికి పాజిటివ్ అని నిర్ధారణ జరిగిందని తెలిపారు. వీరందరినీ నిర్దేశిత ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేస్తున్నట్లు తెలియజేశారు.
రేపు అన్నీ జిల్లాల వైద్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్:
అలాగే హైదరాబాదులో ఉన్న ప్రతి ఆసుపత్రిలో పైన 24 గంటలు డాక్టర్ ను అందుబాటులో ఉంచుతున్నామని, ఏ ప్రమాదం జరిగినా వెంటనే చికిత్స అందించే విధంగా వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచామని డాక్టర్ రమేష్ రెడ్డి వివరించారు. ఇక సీజనల్ వ్యాధులు వచ్చిన తర్వాత బాధపడే కంటే ముందుగానే వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్య కార్యకర్తలు, ఆశావర్కర్లు గ్రామగ్రామాన ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో మైక్ ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నామని, సీజనల్ వ్యాధులు వచ్చిన వారు ఇతరులకు వాటిని వ్యాప్తి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కలుషిత నీటి ద్వారా ఎక్కువ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, క్లోరినేషన్ టాబ్లెట్లు ఇంటింటికి అందిస్తున్నామని చెప్పారు. ఈ సమయంలో ప్రజలు కూడా పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, వేడి వేడి ఆహార పదార్థాలు మాత్రమే తినాలని కోరారు. జ్వరం జలుబు వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లి వారి సలహాలతో అవసరమైతే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు అందుబాటులో ఉన్నందువల్ల ప్రజలు వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. రేపు అన్నీ జిల్లాల వైద్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu