64 దేశాలకు చెందిన విదేశీ రాయబారులు భారత దేశంలో వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన రెండు ప్రధాన పారిశ్రామిక యూనిట్స్ భారత బయోటెక్ లిమిటెడ్ మరియు బయోలాజికల్ సంస్థలను బుధవారం నాడు సందర్శించారు. భారత దేశం తీసుకుంటున్న కొన్ని కీలక పరిశోధన మరియు అభివృద్ధి కార్యకలపాలను విదేశీ రాయబారులు మరియు హైకమిషనర్లకు తెలియజేయడానికి భారత విదేశీ వ్యవహారాల శాఖ ఈ పర్యటన ను నిర్వహించింది. ఈ ఉన్నత స్థాయి బృందాన్ని రెండు బ్యాచ్ లుగా విభజించి, మొదటి బ్యాచ్ ను భారత బయోటెక్ లిమిటెడ్ కు సందర్శన నిమిత్తం తీసుకెళ్లారు. రెండవ బ్యాచ్ బయోలాజికల్ సంస్థ ను సందర్శించింది. తదుపరి ఈ బ్యాచ్ ను భారత బయోటెక్ లిమిటెడ్ కు తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ విదేశీ ప్రముఖులను స్వాగతిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అతితక్కువ సమయంలోనే దేశంలోనే అద్భుతమైన పురోగతి సాధించిందని అన్నారు. గత ఆరు సంవత్సరాలలో దేశంలో సులభతర వ్యాపారం చేయడంలో రాష్ట్రం ముందున్నదని అన్నారు. హైదరాబాద్ నగరం భౌగోళికంగా దేశానికి మధ్యలో వున్నదని తెలిపారు. విమాన, రోడ్డు రవాణా వ్యవస్థలతో అనుసంధానమై వున్నదని తెలిపారు. ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాల వలన అగ్రశ్రేణి సంస్థలైన గూగుల్, ఆపిల్, ఫేస్ బుక్, అమెజాన్, మైక్రోసాప్ట్ వంటి సంస్థలు అతి పెద్ద యూనిట్లను హైదరాబాద్ లో నెలకొల్పినట్లు తెలిపారు. ఈ సంస్థలు యుఎస్ కు వెలుపల తమ అతిపెద్ద శాఖలను హైదరాబాద్ లో కలిగి ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో ఫార్మా రంగం యొక్క ఉత్పాదక విలువ సుమారు 50 బిలియన్ యుఎస్ డాలర్లు అని తెలిపారు. హైదరాబాద్ లో జరుగుతున్న టీకా ఉత్పత్తిలో 33 శాతం భారతదేశానికే కాకుండా మొత్తం ప్రపంచానికే హైదరాబాద్ టీకా కేంద్రంగా ఉందన్నారు. పరిశ్రమలకు త్వరితగతిన ఆమోదం కోసం రాష్ట్రంలో కొత్త టిఎస్-ఐపాస్ విధానాన్ని రూపొందించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విదేశీ రాయబారులకు వివరించారు. ఈ విధానంలో 15 రోజుల్లో అనుమతి తీసుకోబడని పరిశ్రమలు ఆమోదించబడినట్లుగా భావిస్తారు. ఈ విధానం గేమ్ ఛేంజర్ అని నిరూపించబడిందని మరియు గత ఆరు సంవత్సరాలలో 14 వేల యూనిట్లు గ్రౌండింగ్ జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా పరిశ్రమల మరియు ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ రాష్ట్రం పెట్టుబడి సామర్థ్యాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సందర్శించే ప్రముఖులకు వివరించారు. హైదరాబాద్ ఫార్మా నగరం రాబోయే కొన్ని నెలల్లో పనిచేయనున్నట్లు తెలిపారు. ఆదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్ (ఓ.ఆర్.ఆర్) కు సమీపంలో 500 ఎకరాల్లో వైద్య పరికరాల పార్కును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి వినయ్ కుమార్, జి.ఎ.డి.(పోలిటికల్) ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, మేడ్చల్ కలెక్టర్ శ్వేతా మహంతి, బయోలాజికల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల, భారత బయోటెక్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ