తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎర్రమంజిల్ ప్రాంతంలో పురాతన భవనాలను కూల్చివేచి నూతన అసెంబ్లీ నిర్మాణం చేపట్టాలని తెలంగాణ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేసారు. ఈ పిటీషన్లపై గత కొన్ని రోజులుగా సుదీర్ఘమైన విచారణ చేపట్టిన హైకోర్టు సోమవారం నాడు తుది తీర్పును వెలువరించింది. ఎర్రమంజిల్ లో అసెంబ్లీ నిర్మాణానికి మంత్రివర్గం చేసిన తీర్మానాన్ని కొట్టివేసి, ఆ నిర్ణయం చట్టపరిధిలో లేదని కోర్టు తెలిపింది. అసెంబ్లీని, ఎర్రమంజిల్ భవనాలను యధాతధంగా ఉంచాలని, ఎటువంటి కూల్చివేతలు చేపట్టరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
జూన్ 3వ తేదీ నుండి పలు దఫాలుగా ఎర్రమంజిల్ భవనాల కూల్చివేత పై హైకోర్టులో విచారణ సాగుతుంది. పిటిషనర్ల తరుపు న్యాయవాది పురాతన భవనాలను కూల్చివేసి, కొత్త నిర్మాణాలను చేపట్టడానికి అభ్యంతరం వ్యక్తం చేసారు. కొత్త భవనాల నిర్మాణాన్ని చేపడితే, పురాతన కట్టడాలను పరిరక్షించాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించినట్టు అవుతుందని, భవిష్యత్లో ట్రాఫిక్ సమస్యలు కూడ తలెత్తుతాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కోర్టు వారి వాదనతో ఏకీభవించి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది. హైకోర్టు తాజా నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
[subscribe]