తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ అంత్యక్రియలను బుధవారం నాడు ఆయన స్వస్థలమైన గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో నిర్వహించనున్నారు. సోమవారం నాడు కోడెల భౌతికకాయాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తరలించిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారాలోకేష్, ఎల్.రమణ, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, పలువురు టీడీపీ నాయకులు, అభిమానులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చేరుకొని కోడెల కు నివాళులు అర్పించారు. కోడెల కుటుంబ సభ్యులను చంద్రబాబు ఓదార్చారు. ఇక మంగళవారం నాడు ఉదయం 8 గంటల నుండి కోడెల పార్థివదేహాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి గుంటూరుకు తరలించనున్నారు. టీడీపీ కార్యకర్తల సందర్శనార్థం 2 గంటలపాటు కోడెల భౌతికకాయాన్ని గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఉంచుతారు. అనంతరం నాలుగు గంటల సమయంలో పార్ధివదేహాన్ని గుంటూరు నుంచి నరసారావుపేటకు తరలిస్తారు.
మరో వైపు కోడెల శివప్రసాద్ రావు ఉరేసుకునే చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో ప్రాధమికంగా తెలుస్తుంది. ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. మెడ భాగంలో 8 అంగుళాల మేరకు తాడు బిగించుకున్న ఆనవాళ్లు ఉన్నట్లు పోస్టుమార్టం చేసిన ఉస్మానియా వైద్యులు గుర్తించినట్టు తెలుస్తుంది. సుమారు రెండు గంటలపాటు నిర్వహించిన పోస్టుమార్టం పక్రియను పోలీసులు రికార్డు చేసారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి విచారణ చేపడతామని వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. కోడెల డ్రైవర్, గన్ మెన్, పనివాళ్లను పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు. బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్ లో వారి వాంగ్మూలాన్ని నమోదు చేసారు.
[subscribe]