వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలోని ఓ బావిలో తొమ్మిది మృతదేహాలు వెలుగుచూసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ తొమ్మిది మంది మృతులకు నిర్వహించిన ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదికలో మరిన్ని వివరాలు బయటపడడంతో ఈ ఘటన మిస్టరీ కొద్దికొద్దిగా వీడుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర హోం శాఖా మంత్రి మహమ్మద్ మహ్మూద్ అలీ ఈ ఘటనపై స్పందించారు. వరంగల్ జిల్లాలోని గొర్రెకుంట సంఘటనపై పకడ్బందీగా దర్యాప్తు జరపాలని వరంగల్ పోలీస్ కమీషనర్ వి.రవీందర్ ను శనివారం నాడు ఆదేశించారు.
గొర్రెకుంట గ్రామ పరిధిలోని గొనె సంచుల గోదాం సమీపంలోని బావిలో గురువారం నాడు నాలుగు, శుక్రవారం నాడు ఐదు మృతదేహాలు బైటపడ్డాయి. ఈ సంఘటన నేపధ్యంలో హోంమంత్రి ఈ రోజు వరంగల్ పోలీస్ కమీషనర్ తో ఫోనులో మాట్లాడి సంఘటన వివరాలు తెలుసుకున్నారు. ఒకేసారి తొమ్మిది మృత దేహాలు ఒక బావినుండి బయటపడడంతో, ఈ సంఘటనను అన్ని కోణాల నుండి దర్యాప్తు చేయడానికి అవసరమైన బృందాలను ఏర్పాటు చేసి త్వరితగతిన దర్యాప్తు చేయాలని ఆదేశించారు. మృతులు ఇతర రాష్ట్రాల వారు కావడంతో, వారి కుటుంబ సభ్యులకు పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాలు అప్పగించాలని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు హోం మంత్రి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu