తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ సికింద్రాబాద్ లోని అగ్నిప్రమాద సంఘటన స్థలాన్ని మంగళవారం నాడు అగ్నిమాపక డీజీ సంజయ్ జైన్, హైదరాబాద్ నార్త్ జోన్ డి.సి.పి.చందన దీప్తి మరియు ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రమాద సంఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికీ మూడు లక్షల రూపాయలను ఎక్స్ గ్రేషియా అందజేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారని తెలిపారు. సంఘటనా స్థలంలో లాడ్జింగ్ ఉన్నందువల్ల వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని తెలియజేశారు. చనిపోయిన వారిలో ఢిల్లీ వాస్త్యవులు రాజీవ్ మాలిక్, సందీప్ మాలిక్, వీరేంద్ర కుమార్, ఒడిశా రాష్ట్రము బాలాసోర్ వాస్తవ్యులు మిథాలి మహాపాత్ర, కటక్ వాస్తవ్యులు చందన్ జేతి, ఆంధ్రప్రదేశ్ విజయవాడ వాస్తవ్యులు అల్లాడి హరీష్, చెన్నై నుండి సీతరామన్, యెన్.బాలాజీలుగా గుర్తించడం జరిగిందని తెలిపారు.
అగ్నిప్రమాదం జరిగిన తర్వాత దట్టమైన పొగ వ్యాపించడంతో వీరు ప్రాణాలు కోల్పోయారని ప్రాథమికంగా తెలిసిందన్నారు. ఇది చాలా బాధాకరమని అన్నారు. ఈ సంఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపారు. వారిలో కొద్దిమంది యశోద ఆసుపత్రిలో, మరికొద్దిమంది గాంధీ ఆసుపత్రిలోనూ చికిత్స పొందుతున్నారని తెలిపారు. సంఘటనపై పోలీస్ శాఖ మరియు అగ్నిమాపక శాఖలు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించాయని, అన్ని కోణాలలో పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని ఆదేశించామని, దర్యాప్తు పూర్తి అయిన తరువాత మరిన్ని వివరాలు తెలిసే ఆస్కారం ఉందని అభిప్రాయపడ్డారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించి, ప్రమాదానికి బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY