తెలంగాణ కాంగ్రెస్లో పీసీసీ పదవుల కోసం చేపట్టిన నియామకం కల్లోలం రేపుతోంది. ఇప్పటికే దీనిపై పార్టీలోని పలువురు సీనియర్ నాయకులు మీడియా సమావేశం పెట్టి బాహాటంగా విమర్శలు చేయగా.. తాజాగా మరో వర్గం నేతలు వీరికి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ములుగు ఎమ్మెల్యే సీతక్క సహా 12మంది నేతలు తమ పీసీసీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో టీ-కాంగ్రెస్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇక రాజీనామా చేసిన వారిలో ఆమెతో పాటు వేంరెడ్డి నరేందర్ రెడ్డి, విజయ రామారావు, చారగొండ వెంకటేశ్, ఎర్ర శేఖర్, పటేల్ రమేష్ రెడ్డి, సత్తు మల్లేశ్ తదితర నేతలు ఉన్నారు. అయితే వీరంతా గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి అనంతర పరిణామాలలో కాంగ్రెస్ పార్టీలోకి రావడం, అందులోనూ వీరంతా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సన్నిహితులుగా ముద్ర పడటం వంటి కారణాలతో రాజీనామాల వ్యవహారం చర్చనీయాంశం అయింది. ఈ సందర్భంగా సీనియర్లు తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని బలహీనపరిచే కుట్ర జరుగుతోందని, అలాగే త్వరలో రేవంత్ చేపట్టనున్న పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వీరు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం గాంధీభవన్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన పీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ అన్నాక అభిప్రాయం భేదాలు సహజమని, చిన్న చిన్న గొడవలను పెద్దవి చేసి చూడటం సరికాదని వ్యాఖ్యానించారు. ఇక సమావేశానికి సంబంధించిన విషయాలే మాట్లాడాలని, ఎజెండాలో ఉన్న అంశాలను చర్చించి ఒక నిర్ణయానికి రావాలని నేతలకు సూచించారు. ‘భారత్ జోడో యాత్ర’ ద్వారా రాహుల్ గాంధీ దేశవ్యాప్త పర్యటన చేస్తున్న ఈ సమయంలో అంతర్గత కలహాలు మంచివి కావని, ఏవైనా సమస్యలుంటే ఢిల్లీకి వెళ్లి అధిష్టానాన్ని కలిసి పరిష్కరించుకుందామని తెలిపారు. ఇక త్వరలోనే తాను తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపడుతున్నానని, దీనికి నేతలంటే సహకరించాలని కోరారు. ఇక ఈ భేటీకి కొందరు సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, చిన్నారెడ్డి, మల్లు రవి, నాగం జనార్ధన్ రెడ్డి తదితరులు హాజరవగా పలువురు సీనియర్ నేతలు గైర్హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE