తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, సీపీఎం నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (93) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని ఆదివారం కొద్దిసేపు హైదరాబాద్లోని పార్టీ కార్యాలయం ఎంబీ భవన్లో ఉంచారు. స్వరాజ్యం తొలుత ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ, ఆ తర్వాత సీపీఎంతో జీవితాంతం కొనసాగారు. స్వాతంత్ర్య పోరాటంలో కానీ, రజాకార్లకు వ్యతిరేకంగా సాగించిన సాయుధ పోరాటంలో కానీ ఆమె తెగువ అనన్య సామాన్యం. 1947-48 కాలంలోనే స్వరాజ్యాన్ని పట్టిస్తే రూ.10 వేల బహుమతి ఇస్తామని నిజాం ప్రభుత్వం ప్రకటించిందంటే వారిని ఆమె ఏ విధంగా ఎదిరించిందో అర్ధమవుతుంది.
స్వరాజ్యం, తన సహచర పోరాటయోధుడు మల్లు వెంకట నర్సింహారెడ్డిని కామ్రేడ్స్ పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సాయుధ పోరాటం విరమణ అనంతరం ఆమె కమ్యూనిస్టు పార్టీ నుంచి 1978, 1983 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. కాగా, మల్లు స్వరాజ్యం మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. కేసీఆర్, జగన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై, ప్రతిపక్ష నేతలు.. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తదితరులు ఆమె మృతికి సంతాపం తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ