కాసేపట్లో ముగియనున్న పోలింగ్ కార్యక్రమంలో..ఎవరు ఏ పార్టీకి ఓటేసారో అన్న టెన్షన్ అభ్యర్ధులకు పట్టుకుంది. ప్రధాన పార్టీలతోనే పోరు అనుకుంటే చాలాచోట్ల నిలబడ్డ స్వతంత్రులు అభ్యర్దులకు టెన్షన్ తీసుకువస్తున్నారన్న టాక్ వారిలో కొత్త గుబులు రేపుతోంది. తెలంగాణలో చాలా జిల్లాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా నిలిచి కాస్త ఓట్లు తెచ్చుకొనే పరిస్థితి ఉన్నచోట ఇప్పుడు అన్ని పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.
స్వతంత్రులకు వచ్చే ఓట్లు ప్రధాన పార్టీల్లో ఏవి ఏ పార్టీని దెబ్బతీస్తాయా అన్న చర్చ సాగుతోంది. దాదాపు 15 నియోజకవర్గాల్లో ఉన్న ఇలాంటి పరిస్థితి వల్ల బీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీ-జనసేన కూటమి, బీఎస్పీ పోటీ చేస్తున్న అభ్యర్దులకు ముప్పు తప్పదన్న వాదన వినిపిస్తోంది. ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడిన కొంతమంది రెబల్స్గా నామినేషన్ వేయగా.. మరికొంత మాత్రం స్వతంత్రులుగా పోటీ చేసారు. వీరిలో నేతల బుజ్జగింపులతో ఎక్కువ మంది నామినేషన్లు ఉపసంహరించుకొన్నా కూడా.. కొంతమంది మాత్రం బరిలో ఉన్నారు. వీరిలో ఎక్కువగా ఫార్వర్డ్బ్లాక్, బీఎస్పీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.
నల్లగొంలో బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన పిల్లి రామరాజుయాదవ్.. ఫార్వర్డ్బ్లాక్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయన చీల్చే ఓట్లు ఇక్కడ ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరి పైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.
సూర్యాపేటలో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన.. వట్టే జానయ్య యాదవ్ ఆఖరి నిమిషంలో బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయన డీసీఎంఎస్ ఛైర్మన్గా పని చేశారు. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖపోటీ ఉండటంతో.. జానయ్యకు వచ్చే ఓట్లు కీలకం కానున్నాయి.
కొత్తగూడెంలో మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కూడా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున ఆఖరి నిమిషంలోనే బరిలోకి దిగారు. దీంతోనే ఇక్కడ త్రిముఖపోటీ నెలకొంది. ఇక్కడ గెలుపోటములే కాదు.. మూడోస్థానం ఎవరిదనేది కూడా చర్చనీయాంశం అయింది.
మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ రామగుండంలో స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగారు. సీనియర్ రాజకీయ నాయకుడుగా ఈ నియోజకవర్గంలో ఉన్న ఆయన పొందే ఓట్లు..బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల భవిష్యత్తును తేల్చనుంది. కొల్లాపూర్లో తెలంగాణ వ్యాప్తంగా గుర్తింపు పొందిన స్వతంత్ర అభ్యర్థి.. బర్రెలక్క(శిరీష) గట్టి పోటీనే ఇస్తున్నారు. చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి వెళ్లి మరీ ఆమెకు ప్రచారం చేశారు. శిరీషకు ఎక్కువ ఓట్లు వస్తే.. ప్రధాన పార్టీలో ఆందోళన తప్పదు.
సిర్పూరు కాగజ్నగర్లో బీఎస్పీ నుంచి బరిలోకి దిగిన.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్కుమార్ ప్రధాన పార్టీలకు సవాలు విసురుతున్నారు. అంతేకాదు పెద్దపల్లిలో పోటీలో ఉన్న బీఎస్పీ అభ్యర్థి దాసరి ఉష కూడా గట్టిపోటీనే ఇస్తున్నారు.
పటాన్చెరులో ముందుగా కాంగ్రెస్ టికెట్ పొంది తర్వాత బీ-ఫాం మరొకరికి ఇవ్వడంతో..బయటకు వచ్చి బీఎస్పీ అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్ బరిలోకి దిగారు. ముదిరాజ్కు వచ్చే ఓట్లు కూడా అన్ని పార్టీల అభ్యర్ధులకు సమస్యగా మారే అవకాశం ఉంది. మక్తల్లో బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన వర్కటం జగన్నాధరెడ్డి బీఎస్పీ నుంచి బరిలోకి దిగారు. జగన్నాధరెడ్డి కొన్నేళ్లుగా నియోజకవర్గంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుండటంతో ..ప్రధాన అభ్యర్థుల గెలుపు, ఓటములను నిర్దేశించే అవకాశం ఆయనకు ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే ఇతర నియోజకవర్గాల్లో కూడా బీఎస్పీకి వచ్చే ఓట్లు.. ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయావకాశాలపై చూపించే అవకాశం ఉంది. జహీరాబాద్లో బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్న జంగం గోపి.. ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు, ఓటములను నిర్ణయించనున్నారు. గద్వాలలో ఫార్వర్డ్బ్లాక్ నుంచి బరిలో దిగిన.. నడిగడ్డ పోరాట సమితికి చెందిన రంజత్కుమార్ కూడా ప్రధాన పార్టీలపై ప్రభావం చూపించనున్నారు. ఆయన గత ఎన్నికల్లో బీఎల్ఎఫ్ తరఫున పోటీ చేశారు.
కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి సంజీవరెడ్డి ఆదిలాబాద్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అలాగే సీపీఎం 19 స్థానాల్లో పోటీ చేస్తోంది. పాలేరు, మిర్యాలగూడ, భద్రాచలం, ఇబ్రహీంపట్నంతో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లోనూ సీపీఎం పార్టీ అభ్యర్థుల ప్రభావం పడే అవకాశం ఉంది.
మొత్తంగా.. స్వతంత్రులు, బీఎస్పీ, సీపీఎం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల నుంచి.. ప్రధాన పార్టీల అభ్యర్థులకు 15 నియోజకవర్గాలలో 10-15 వేల ఓట్లు తగ్గే అవకాశం ఉంది. ఇది కచ్చితంగా ప్రధాన పార్టీల అభ్యర్థులకు నిద్రను దూరం చేసే విషయమే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE