ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ‘టెస్లా’ సీఈవో ఎలన్ మస్క్ను తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానించారు రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్. ‘‘భారత్లో కార్ల వ్యాపారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాం’’ అంటూ టెస్లా సీఈవో మస్క్ చేసిన ట్వీట్ రాజకీయవర్గాల్లో సంచలనమైంది. దీనిని పలు రాష్ట్రాలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, పంజాబ్.. ఇలా ప్రముఖ రాష్ట్రాలు టెస్లాకు అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తాం అని ముందుకొస్తున్నాయి. అయితే, ఈ విషయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ అందరికన్నా ముందుగా స్పందించారు. టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ను తెలంగాణకు ఆహ్వానించారు.
‘‘హే ఎలన్.. నేను భారత్లోని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రిని. కొత్త పరిశ్రమల ఏర్పాటులో తెలంగాణ రాష్ట్రం.. దేశంలోనే అత్యుత్తమ వ్యాపార గమ్యస్థానం. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తే సహ భాగస్వామిగా కలిసి పనిచేసేందుకు, ఏర్పాటుకు అయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ముందుంటాం’’ అంటూ మంత్రి కేటీఆర్ ఈ నెల 15న ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్కు పలువురు సినీ ప్రముఖులు మద్దతుపలికారు. నటులు విజయ్ దేవరకొండ, నిఖిల్, దర్శకులు మెహర్ రమేశ్, గోపిచంద్ మలినేని.. టెస్లా సీఈవోను ఉద్దేశిస్తూ పెట్టుబడుల కొరకు రాష్ట్రానికి రావాలని కోరారు.
అగ్రరాజ్యం అమెరికా లోని టెక్సాస్ కేంద్రంగా 18 ఏళ్ల క్రితం ప్రారంభమై అంచెలంచెలుగా అనేక దేశాలకు విస్తరించింది టెస్లా కంపెనీ. ఎలక్ట్రిక్ కార్ల రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద బ్రాండ్గా టెస్లా అవతరించింది. ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో వాహనాల తయారీ కేంద్రాన్ని భారత్లో ఏర్పాటు చేస్తామని టెస్లా సీఈవో మస్క్ 2020లోనే ప్రకటించారు. అప్పటినుంచి భారత ప్రభుత్వంతో జరుపుతున్న చర్చలు సానుకూల నిర్ణయానికి రాకపోవడంతో.. ఎలన్ మస్క్ ఇటీవలే ట్విటర్ ద్వారా భారత ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టెస్లా ఇండియ మోటార్స్ పేరుతో ఈ సంస్థ ఇప్పటికే బెంగళూరు కేంద్రంగా కంపెనీ రిజిస్టర్ చేసుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ