కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ప్రకటన మరింతగా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ నెల మొదటి వారంలో కాంగ్రెస్ తొలి జాబితా వెలువడే అవకాశాలు ఉన్నాయని మొదట అంతా అంచనా వేసినా కూడా.. ఇప్పుడు అది మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల షెడ్యూలు ఎప్పుడైనా కూడా రావచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ తేదీ ఖరారైతే.. అదే రోజు అయినా ఆ మరుసటి రోజు తొలిజాబితా ప్రకటన ఉంటుందని పీసీసీ భావిస్తోంది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోసం షెడ్యూల్ ఎప్పుడైనా , ఏ క్షణమైనా వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని.. అంతా అనుకున్నా కూడా అది ఇప్పుడు సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అదిగో ఇదిగో అని ఊరిస్తున్న అభ్యర్థుల జాబితా అక్టోబర్ ఫస్ట్ వీక్లో విడుదల అవుతుందనుకున్నా.. ఇప్పట్లో ఆ దాఖలాలు కనిపించడమే లేదు.
అయితే ఇప్పటికే దాదాపు 40కి పైగా అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై మాత్రం.. స్క్రీనింగ్ కమిటీలో ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది. కానీ మరో 30 నియోజకవర్గాల్లో టికెట్ల కోసం గట్టి పోటీ ఉండడంతో ..మళ్లీ ఒకసారి సర్వేలు నిర్వహించాలని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించడంతోనే ఈ ఆలస్యమని పార్టీ పెద్దలు చెబుతున్నారు. దీనికోసమే సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి సర్వేలు కొనసాగుతున్నట్లు అంటున్నారు. దీనికి సంబంధించిన సమాచారం డైరక్టుగా స్క్రీనింగ్ కమిటీకి చేరేట్లు ప్రణాళికలు కూడా సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నిజానికి సెప్టెంబర్ నెల 30న కానీ అక్టోబర్ 3న కానీ స్క్రీనింగ్ కమిటీ మరోసారి సమావేశం అవుతుందని పీసీసీ వర్గాలు అనుకున్నాయి. కానీ మారుతున్న రాజకీయ పరిణామాల వల్ల ఆ రెండు తేదీల్లోనూ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగలేదు పైగా .. స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఎప్పుడు జరుగుతుందోనన్న తేదీ కూడా ఇంకా ఖరారు కాలేదు. దీంతో స్క్రీనింగ్ కమిటీ ఎప్పుడు సమావేశం అవుతుందా అని పార్టీ శ్రేణులు కూడా ఎదురుచూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అలాగే అక్టోబర్ నెల 7న పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమయ్యే అవకాశాలు ఉన్నట్లు మొదట అంచనా వేసినా కూడా.. తర్వాత అది కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో చివరకు ఈ అక్టోబర్ రెండో వారంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై.. తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
కేంద్ర ఎన్నికల కమిటీ తేదీ ఖరారయిన వెంటనే.. ఆ ముందు రోజు స్క్రీనింగ్ కమిటీ సమావేశమై కాంగ్రెస్ తొలి జాబితాకు సంబంధించి దాదాపు 70 పేర్లను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, మిర్యాలగూడ, భువనగిరి, సూర్యాపేట, జనగామ వంటి 27 నియోజకవర్గాలల్లో ప్లాష్ సర్వేలు ముగిసినట్లు తెలుస్తోంది.
గెలుపే లక్ష్యంగా పారదర్శకంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఇప్పటికే పీసీసీ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. కాస్త లేటయినా గెలుపు గుర్రాలకే సీట్లు ఇచ్చి కాంగ్రెస్ బలాన్ని నిరూపించుకునే పనిలో పడ్డాయి.కాకపోతే గతంలో కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆలస్యం కావడం .. అప్పుడు పార్టీ గెలుపుపై అది ప్రభావం చూపినట్లే ఈ సారి కూడా అవుతుందా అన్న ఆందోళనను పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE