బీఆర్ఎస్కు బైబై చెప్పేసి కొడుకు రోహిత్తో కలిసి కాంగ్రెస్లో చేరిన మైనంపల్లి హన్మంతరావుకు.. పాపం వరుస పెట్టి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. మైనంపల్లి రాకను వ్యతిరేకిస్తూ హస్తానికి గుడ్ బై చెప్పేస్తున్న నేతల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. రెండు రోజుల తేడాలలో ఇద్దరు కీలక నేతలతో పాటు మరికొందరు కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పడంతో ఏం జరుగుతుందో అర్థంకాక అక్కడి నేతలతో పాటు మైనంపల్లి కూడా తల పట్టుకుని కూర్చుంటున్నారు.
అక్టోబర్ నెల ఎంటరయిందో లేదో ఈ నెల 1న మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి కాంగ్రెస్ను వీడారు. అలాగే ఆ మర్నాడు అక్టోబర్ 2 న మల్కాజిగిరి డీసీసీ చీఫ్ నందికంటి శ్రీధర్ హస్తం పార్టీకి బైబై చెప్పేశారు. అంతేకాదు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు.. జె.వెంకట్రెడ్డి కూడా తాజాగా కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు. ఈ పరిణామాలను ఏమాత్రం ఊహించని పార్టీ కంగుతింటే.. తన రాక ఇలాంటి ప్రకంపనాలు సృష్టిస్తుందా అని మైనంపల్లి నివ్వెరపోతున్నారు.
నిజానికి మొదటి నుంచి మైనంపల్లి చేరికను తిరుపతిరెడ్డి, శ్రీధర్ ఇద్దరూ వ్యతిరేకిస్తూనే వచ్చారు. అయినా అధిష్ఠానం వీరి అభిప్రాయాలను పక్కన పెట్టి ముందుకెళ్లడంతో వారిద్దరూ రాజీనామా చేశారు. వీరిద్దరినీ బుజ్జగించేందుకు కాంగ్రెస్ పెద్దలు చేసిన ప్రయత్నాలేమీ కూడా ఫలించలేదు. చివరకు భట్టి విక్రమార్క, మధుయాష్కీగౌడ్ నందికంటి శ్రీధర్ ఇంటికి వెళ్లి మరీ బుజ్జగించే ప్రయత్నం చేసినా..ఏం ఫలితం దక్కలేదు. ఇప్పుడు మరికొందరు నేతలు కూడా పార్టీని వీడటానికి సిద్ధమవుతున్నట్టు తెలిసిన పార్టీ వారిని బుజ్జగించే పనిలో పడుతోంది.
మైనంపల్లి చేరికతో బీఆర్ఎస్కు గట్టిగా చెక్ పెట్టొచ్చనుకున్న కాంగ్రెస్ ఉత్సాహం..ఇప్పుడు నీరు గారిపోయింది. మైనంపల్లి హన్మంతరావు చేరికతో కాంగ్రెస్ పార్టీ బలపడటంతో పాటు.. ఆయన వైపున్న బీఆర్ఎస్ వర్గాలలో కూడా తమ బలాన్ని పెంచుకుందామని అంచనా వేసింది కాంగ్రెస్. కానీ ఇప్పుడు అతని రాకతోనే బలహీనపడుతుండడం పార్టీకి ఏమాత్రం మింగుడుపడడం లేదు. ఇద్దరు కీలక నేతలు పార్టీకి రాజీనామా చేయడం..మరికొందరు అదే బాటలో ఉన్నట్టు తెలియడంతో పార్టీలో ఆందోళన మొదలయింది.ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుందే అనుకుంటూ మైనంపల్లి చేరికపై అసంతృప్తికి లోనవుతంది.
మరోవైపు కాంగ్రెస్లో చేరిన మైనంపల్లి హన్మంతరావు.. తనకు తానుగా దెబ్బతినడంతోపాటు ఇప్పుడు హస్తం పార్టీని కూడా దెబ్బతీశారన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో నెలకొంది. ఇటు మల్కాజిగిరి, అటు మెదక్లోనూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం పోతుందని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు రానురాను కాంగ్రెస్ పార్టీకి మైనంపల్లి గుదిబండలా మారే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని కూడా.. కొంతమంది నేతలు బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్పైన పంతం పట్టి మరీ.. పార్టీని వీడిన మైనంపల్లికి ఆరంభంలో ఉన్న సంతోషం ఇప్పుడు పటాపంచలు అయిపోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టగానే ఇద్దరు డీసీసీ అధ్యక్షులు హస్తం పార్టీ వీడటంపై.. అధిష్టానం కూడా మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది. ఇలాంటి ఊహించని పరిణామాలు మైనంపల్లి పోటీపైనే కాదు.. కాంగ్రెస్ పార్టీపైనే ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ క్యాడర్ తనతో కలిసి రాకపోవడంతో పాటుట, కాంగ్రెస్ క్యాడర్ కూడా తనతో నడిచేందుకు సిద్ధంగా లేకపోవడంతో మైనంపల్లి హన్మంతరావు పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్లో.. కాస్త కష్టమైనా ఈ సారి కూడా కేసీఆరే పగ్గాలు చేపడతారని.. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితులలోనూ అధికారంలోకి వచ్చేది లేదని, అలాంటప్పుడు ఆయనతో కలిసి వెళ్లడం దండగన్న చర్చ జరుగుతుండటం మైనంపల్లికి మైనస్గా మారిపోయింది .
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE