తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వలన మరణించిన ప్రతీ సర్పంచ్ కుటుంబానికీ రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆయన సోమవారం టీపీసీసీ రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన సర్పంచ్ల నిరసన కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్లను సమస్యల్లో పడేసిందని, ప్రభుత్వం మొండి వైఖరితో కొందరు సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. సర్పంచ్ల నిరసనకు సంఘీభావంగా ధర్నా చేస్తామంటే ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుందని, అయినా వెనుకడుగు వేయకుండా హైకోర్టు అనుమతితో నేడు కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహిస్తోందని తెలిపారు.
ఇంకా రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. ఆందోళనకు ముందస్తు అనుమతి తీసుకున్నామని, అయినా కూడా పలువురు పార్టీ నేతలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలను వెంటనే విడుదల చేసి ధర్నాలో పాల్గొనేందుకు అనుమతించాలని కోరారు. ఇక సర్పంచ్లకు ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయాలని, అలాగే వారి విధులను నిర్వచించాలని కూడా డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అంటే భారత్ రాష్ట్ర సమితి కాదని తెలిపిన ఆయన అది భస్మాసుర సమితి అని విమర్శించారు. సర్పంచ్లకు తమ పార్టీ అండగా ఉంటుందని, గ్రామ పంచాయతీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. గ్రామం గౌరవం పెరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్లకు గౌరవం ఇవ్వాలని, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని రేవంత్ రెడ్డి సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE