కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మే 7న ఇక్కడి ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించేందుకు అధికారులు అనుమతి నిరాకరించడంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. కేవలం ప్రభుత్వ ఒత్తిడితోనే ఓయూలో రాహుల్ సభకు అనుమతి ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. అయితే ఓయూ అధికారులు అనుమతి నిరాకరించినప్పటికీ తమ ప్రత్యామ్నాయ ప్రణాళికలతో ముందుకు వెళతామని ఆయన తెలిపారు. ఈ నెల 6, 7 తేదీలలో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్న రాహుల్ గాంధీ.. మే 6న వరంగల్లో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు. అయితే ఆ తరవాతి రోజు ఓయూలో విద్యార్థులతో రాహుల్ ముచ్చటించటానికి పార్టీ సన్నాహాలు చేసింది. కాగా ఈ సమావేశానికి ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు. ఈ ఒక్క కార్యక్రమానికే కాదని, భవిష్యత్తులో కూడా ఎలాంటి రాజకీయ సభలకు అనుమతి ఇచ్చేది లేదంటూ స్పష్టం చేశారు.
అయితే రాహుల్ గాంధీ పర్యటనకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. అధికారులు ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వ ఒత్తిడే కారణమని పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకోవచ్చు.. అలాగే బీజేపీ నేతలు ఉస్మానియా యూనివర్శిటీని సందర్శించి సభల్లో ప్రసంగించవచ్చు. మరి అలాంటప్పుడు మా నాయకుడు క్యాంపస్ను ఎందుకు సందర్శించకూడదు అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో మొదటి, రెండో విడత ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ కీలకపాత్ర పోషించినందున రాహుల్ గాంధీ క్యాంపస్కు వెళ్లి విద్యార్థులతో మమేకమై నిరుద్యోగ సమస్య గురించి తెలుసుకోవాలని రాహుల్ గాంధీ యోచిస్తున్నారని, ఈ పర్యటనలో ఎలాంటి రాజకీయానికి చోటు లేదని ఆయన వాదించారు. ఇంకా తాము ఎలాంటి పార్టీ జెండాలను ప్రదర్శించడం కానీ, నినాదాలు చేయడం కానీ చేయబోమని హామీ ఇచ్చినా కూడా అధికారులు అనుమతి ఇవ్వలేదని, దీని వెనుక రాజకీయ కారణాలున్నాయని తెలిపారు. యూనివర్శిటీ పరిపాలన కమిటీ అనుమతి నిరాకరించడాన్ని రేవంత్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఖండించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ