రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణలకు గడువుంది. ఆ తర్వాత ఎంతమంది బరిలో మిగిలేది స్పష్టత రానుంది. ఈసారి ఒకే పార్టీ నుంచి టిక్కెట్లు ఆశించినవారు ఎక్కువ సంఖ్యలో ఉండటం.. వారందరికీ పార్టీలు టిక్కెట్లు ఇవ్వకపోవడంతో టిక్కెట్లు రాని వారు రెబెల్స్గా పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వారి వల్ల తమ ఓట్లకు గండి పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రెబెల్స్ను ఉపసంహరింపచేసేందుకు అన్ని ప్రధాన పార్టీల్లోని ముఖ్యనేతలు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
ఆ పార్టీ, ఈపార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీల్లోనూ రెబెల్స్ నామినేషన్లు వేశారు. ఈ సంఖ్య కాంగ్రెస్లో మిగతా పార్టీల కంటే ఎక్కువగా ఉంది. ఆ పార్టీలో ఇరవైకి పైగా నియోజకవర్గాల్లో రెబెల్స్ నామినేషన్లు దాఖలు చేశారు. దాని కంటే తక్కువ నియోజకవర్గాల్లో బీజేపీకి, అంతకంటే ఇంకొన్ని తక్కువ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు సైతం రెబెల్స్గా నామినేషన్లు వేసిన వారున్నారు. వీరిలో బీఆర్ఎస్ అలాంటి వారిని దాదాపుగా దారికి తెచ్చినట్లు తెలుస్తోంది. గడువు ముగిసేలోగా వారు తమ నామినేషన్లను ఉపసంహరించుకోనున్నారు. మిగతా పార్టీల్లోనే..ముఖ్యంగా కాంగ్రెస్లో ఈ పరిస్థితి క్లిష్టంగా ఉన్నట్లు సమాచారం. ఉపసంహరణలకు రెబెల్స్గా నామినేషన్లు దాఖలు చేసిన వారు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ నుంచి టిక్కెట్లు ఆశించి అవి దక్కకకపోవడంతో నామినేషన్లు వేసిన వారిలో జంగారాఘవరెడ్డి(వరంగల్ వెస్ట్), రామ్మూర్తినాయక్(వైరా), లక్ష్మీనారాయణనాయక్(పాలకుర్తి), నెహ్రూనాయక్(డోర్నకల్), నరేశ్జాథ్(బోథ్), గాలి అనిల్కుమార్(నర్సాపూర్), ఎస్.గంగారాం(జుక్కల్), కాసుల బాలరాజు(బాన్సువాడ), నాగి శేఖర్(చొప్పదండి), డి.రవీందర్(నకిరేకల్), ప్రవీణ్నాయక్(ఇల్లందు), పి.రమేశ్రెడ్డి(సూర్యాపేట), సి.దేవరాజు(పరకాల),నీలం మధు(పటాన్చెరు),సిరిసిల్ల రాజయ్య(వర్ధన్నపేట), తదితరులున్నారు. వీరిని ఉపసంహరింపచేసేందుకు పార్టీ అగ్రనాయకులు మాణిక్రావు ఠాక్రే, బి.మహేశ్కుమార్గౌడ్లు రంగంలోకి దిగారు. వారి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో సాయంత్రం వెల్లడి కానుంది.
బీజేపీ,బీఆర్ఎస్లలో.. బీఆర్ఎస్లో ఒకటి రెండు స్థానాల్లో నూ అదే పరిస్థితి ఉంది. ఇక బీజేపీలోనూ కొన్ని నియోజకవర్గాల్లో రెబెల్స్ బెడద తప్పేలా లేదు. అలాంటి వారిలో ఎల్.శ్రీనివాస్(సిరిసిల్ల), రాజేశ్వర్రావు దేశ్పాండే(పటాన్చెరు),కె.విజయ్(ఆసిఫాబాద్), కె.మణెమ్మ(నాగర్కర్నూల్), తదితరులున్నారు. వీరిలో ఎందరు ఉపసంహరించుకుంటారో, ఎందరు రంగంలో నిలుస్తారో, అంతిమంగా అన్ని పార్టీల నుంచివెరసి ఎంతమంది ఎన్నికల బరిలో ఉంటారో ఈరోజు సాయంత్రం తర్వాత స్పష్టత రానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ