తెలంగాణలో గత కొన్ని రోజులుగా కొనసాగిన ఉత్కంఠ విడిపోయింది. హుజూర్నగర్ అసెంబ్లీ నియోజక వర్గ ఉపఎన్నికలలో హోరాహోరీగా పోరాడిన టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో చివరకు తిరుగులేని విధంగా టిఆర్ఎస్ పార్టీ పై చేయి సాధించింది. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి ప్రతి రౌండ్లో ఆధిక్యత సాధిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిపై 43358 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. దీనితో గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హుజూర్నగర్ లో ఎట్టకేలకు టిఆర్ఎస్ పాగా వేసింది. టిఆర్ఎస్ పార్టీ నాయకుల విస్తృత ప్రచారం, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలే ఇటువంటి విజయానికి దోహద పడ్డాయని పరిశీలకులు చెబుతున్నారు. మరో వైపు టీడీపీ, బీజేపీ పార్టీలు కనీస స్థాయిలో కూడ ప్రభావం చూపలేక పోయాయి.
ఈ ఎన్నికల బరిలో ముగ్గురు మహిళలతో కలిపి మొత్తం 28 మంది అభ్యర్థులు ఉన్నారు. టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించి పోటా పోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడంతో తుది ఫలితాల కోసం ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూసారు. పక్క ప్రణాళికతో, ప్రత్యేకమైన పోల్ మేనేజ్ మెంట్ తో టిఆర్ఎస్ పార్టీ అద్భుత విజయాన్ని దక్కించుకుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేసారు. ఉప ఎన్నికలలో గెలుపు సాధించే ఆనవాయితీని టిఆర్ఎస్ పార్టీ మరోసారి కొనసాగించింది. హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితంపై సీఎం కేసీఆర్ ఈ రోజు సాయంత్రం మీడియాతో మాట్లాడనున్నారు.
[subscribe]